Srisailam | వీరభద్రుడి శరణు ఘోషలతో శ్రీశైల క్షేత్రం మార్మోగింది. అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో గురువారం ప్రత్యేక పూజలను శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించారు. క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాల సమయంలో పంచామృతాలు, ఫలోదకాలు, పసుపు కుంకుమ, విభూది.. గంధ జలాలు, బిల్వోదక సుగంధ ద్రవ్యాలు, శుద్ధ జలాలతో అభిషేకాలు, విశేష పుష్పార్చన, మహా నైవేద్య కార్యక్రమాలు ఈవో లవన్న ఆధ్వర్యంలో జరిగాయి. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి అభిషేకార్చనలు నిర్వహిస్తున్నామన్నారు.
ఆరుబయట ఆలయంలో దర్శనమిచ్చే స్వామిని పూజించడంతో భూతప్రేత, పిశాచ, దుష్టగ్రహదోషాలు తొలిగి సర్వకార్యానుకూలతతోపాటు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అర్చకులు తెలిపారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. వివరాల కోసం కాల్సెంటర్ 8333901351/2/3/4/ 5/6 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అలాగే భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలో త్రిఫల వృక్షం కింద కొలువైన దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.