శ్రీశైలం : ఆదివారం అమావాస్యను పురస్కరించుకొని శ్రీశైలం దేవస్థానంలో ప్రదోషకాలంలో బయలు వీరభద్ర స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పరోక్ష సేవ ద్వారా పలువురు భక్తులు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం 6.15గంటలకు పూజలు ప్రారంభం కాగా.. మొదట మహా గణపతిపూజ నిర్వహించారు. అనంతరం వీరభద్రుడికి పంచామృతాలు, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధ జలాలతో అభిషేకం చేశారు. స్వామివారి ఆరాధనతో గ్రహదోహాలు, అరిష్టాలు తొలగిపోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కారమవుతాయని, కోరికలు నెరవేరుతాయని దేవస్థాన అర్చకులు తెలిపారు.
అలాగే స్వామి అమ్మవార్ల పల్లకీసేవను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మొదట లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సేవా సంకల్పాన్ని పఠించారు. ఆ తర్వాత కార్యక్రమం నిర్విగ్నంగా సాగాలని మహాగణపతిపూజ నిర్వహించారు. అనంతరం పల్లకీలో భ్రమరాంబ అమ్మవారు, మల్లికార్జున స్వామివారిని వేంచేపు చేసి శాస్త్రోక్తంగా షోడషోపచార పూజలు నిర్వహించారు. అమావాస్య రోజు జరిగే పరోక్ష సేవలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న భక్తులు దేవస్థానం వెబ్సైట్ www.srisailadevasthanam.orgలో పేర్లు నమోదు చేసుకోవాలని ఈవో లవన్న విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ఆదివారం స్వామి, అమ్మవార్లను ఏపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు.