శ్రీశైలం : శ్రీశైల క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి అమావాస్య ప్రదోషకాలంలో అభిషేకార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం ప్రతి మంగళవారం, అమావాస్య రోజుల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. అదే విధంగా ప్రధానాలయ ప్రాంగణంలోని కుమారస్వామికి కృతికా నక్షత్ర పూజలు అర్చక వేదపండితులచే ఘనంగా జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
అభిషేక కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కమిటీ సభ్యులు విరూపాక్షయ్యస్వామి పాల్గొన్నారు. ప్రతి నెలా వచ్చే అమావాస్య రోజుల్లో సేవాకర్తలు తమ గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైల టీవీ ఛానల్ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్కుమార్ తెలిపారు. పూర్తి వివరాల కోసం 8333901351, 2, 3, 4, 5, 6 నంబర్లలో సంప్రదించాలని కోరారు.