ఓ యువకుడికి ధ్యానం గురించి తెలుసుకోవాలనిపించింది. అదే రోజు ఫలపుష్పాలతో నదీ తీరంలో ఉన్న ఓ ఆశ్రమానికి వెళ్లాడు. ద్వారం దగ్గర ఉన్న కాపలాదారునితో గురువు గారి గురించి ఆరా తీశాడు. ‘ఆయన ధ్యానంలో ఉన్నారు. మీరు విశ్రాంతి గదిలో కూర్చోండి. గురువు గారు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుస్తారు’ అని చెప్పాడు. ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణం ఆ యువకుడికి నచ్చింది. అక్కడే ఓ అందమైన పూలతోట ఉంది. ఓ వ్యక్తి అక్కడి మొక్కలకు నీళ్లు పడుతున్నాడు. ఆ తోటమాలి వైపు చూస్తూ యువకుడు గదిలోకి వెళ్లి కూర్చున్నాడు. గంట తర్వాత గురువు వచ్చాడు. ఇందాక తోటలో నీళ్లు పడుతున్న వ్యక్తే గురువని తెలిసి యువకుడు ఆశ్చర్యపోయాడు. అంతలోనే తేరుకొని ‘నేను ధ్యానం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను’ అని అడిగాడు. అక్కడితో ఆగకుండా ‘గురువు గారు ధ్యానంలో ఉన్నారని కాపలాదారు అన్నాడు.
మీరేమో మొక్కలకు నీళ్లు పడుతున్నారు. అతను అదే విషయం చెప్పొచ్చుగా’ అని ప్రశ్నించాడు. గురువు చిన్నగా నవ్వి ‘చేసే పనిని దైవంగా భావించాలి. దానిపై పూర్తిగా మనసు లగ్నం చేయాలి. నా దృష్టిలో అదే గొప్ప ధ్యానం. అందులో స్థాయి, హోదా, గొప్పల స్పృహ ఉండదు. తోటపని చేస్తున్నప్పుడు నేను గురువును కాదు. అక్కడి మొక్కలకు సంరక్షకుడిని మాత్రమే. నేను గురువునన్న భావంతో తోట పనిచేస్తే దానిపై పూర్తిగా మనసు నిలపలేను. అప్పుడది సంపూర్ణం కాదు. ఆ సమయంలో నేను తోటపనినే ధ్యానంగా భావిస్తాను. అందుకే కాపలాదారు నేను ధ్యానంలో ఉన్నానని చెప్పి ఉంటాడు’ అని వివరించాడు. చేస్తున్న పనికి మించిన ధ్యానం లేదని తెలుసుకున్న యువకుడు గురువుకు నమస్కరించి అక్కడినుంచి కదిలాడు.