ఒక యోగా గురువు పట్టణంలోని ఓ కాలనీలో ఉచిత శిక్షణా శిబిరం నిర్వహించదలిచాడు. అక్కడ ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచాడు. ప్రతిరోజూ ఉదయం గంటసేపు శిబిరానికి వచ్చి యోగా నేర్చుకొని వెళ్లమని అందరినీ ఆహ్వానించాడు. ఆడామగా, చిన్నాపెద్దా ఎవరైనా రావచ్చన్నాడు. యోగా వల్ల రోగులకు ఆరోగ్యం, ఆరోగ్యవంతులకు మరిన్ని ప్రయోజనాలు సిద్ధిస్తాయని పేర్కొన్నాడు. అందరూ అలాగేనని తలలూపారు. అయితే శిక్షణ శిబిరం మొదటి రోజు పట్టుమని పదిమంది కూడా రాలేదు. అయినా, గురువు తరగతులు ప్రారంభించాడు. మొదటి రోజు వచ్చిన పదిమంది కూడా రెండో రోజు రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. కారణం ఏంటని అడిగాడు గురువు. ‘సుఖమైన నిద్రను వదులుకొని, ఉదయాన్నే లేచి శిబిరానికి రావడం ఇబ్బందిగా ఉంది’ అన్నారంతా! వెయ్యిమందికిపైగా ఉన్న కాలనీ నుంచి పదిమంది మాత్రమే శిక్షణకు హాజరవడం తమకు నిరుత్సాహం కలిగించిందని చెప్పారు.
గురువు చిన్న నవ్వు నవ్వి ‘కూరగాయల అంగడికి వెళ్లగలరు, కూరగాయలు కొనగలరు. అదే వజ్రాల అంగడికి ఎందరు వెళ్లగలరు? ఎంతమంది వజ్రాలు కొనగలరు? ఆ కొద్దిమందిలో మీరు ఒకరని గుర్తించాలి. యోగా, ప్రాణాయామాలు చేసి వజ్రంలాంటి శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ముందుకొచ్చిన మీరు అభినందనీయులు. ఎవరో రాలేదని మీరు మానుకోవద్దు. దీని విలువ వారికి తెలియక వారు రావడం లేదు’ అని హితవు చెప్పాడు గురువు. ‘ఆయన చెప్పింది నిజమే కదా!’ అనుకున్న ఆ పదిమంది మరుసటి రోజు నుంచి మరో పదిమందిని తీసుకొని యోగా శిక్షణకు హాజరయ్యారు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821