ఒక ఊరిలో ఓ అంధ కళాకారుడు దారిన వెళ్తున్నాడు. ‘మక్కాలో ముహమ్మద్ అని పేరుగల వ్యక్తి ధర్మాన్ని బోధిస్తున్నాడట. మనుషులంతా ఒక్కటే, దేవుడొక్కడే అని ప్రచారం చేస్తున్నాడట’ అన్న మాటలు అతని చెవినపడ్డాయి. ‘ముహమ్మద్..’ ఈ పేరు చిన్నప్పటి నుంచి చాలాసార్లు విన్నాడు. ఆయన్ను ప్రజలు సాదిక్ (సత్యసంధుడు), అమీన్(నిజాయతీపరుడు) అని పిలవడం కూడా తనకు గుర్తుంది. చిన్నప్పుడు ఎవరూ తన బాగోగులు పట్టించుకోకపోయినా.. ఆయన మాత్రం వచ్చి తన యోగక్షేమాలు అడిగి మరీ వెళ్తుండేవాడు. ఆ విషయాలన్నీ తలుచుకొని తనే ప్రవక్త (స) దగ్గరికి వెళ్లి కలవాలని అనుకున్నాడు. ఆయన ఎక్కడ ఉంటారో అందరినీ అడుగుతూ… ప్రవక్త (స) దర్బారుకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రవక్త తన సహచరులకు దైవం గురించి చెబుతున్నారు. ‘పర్వతాలకూ, సముద్రాలకూ, ఆకాశానికీ, భూమికీ, సూర్యచంద్రులకూ, నక్షత్రాలకూ, ఈ చరాచర సృష్టికి మూలం ఆ ఏకైక దైవం ఒక్కడే’ అని బోధిస్తున్నారు.
కానీ, అంధుడికి ఆ మాటలేం బోధపడలేదు. ఈ వింతలేవీ తను చూడలేదు. అవి ఎలా ఉంటాయో కూడా అతనికి తెలియదు. అప్పుడు ప్రవక్త (స) ‘అల్లాహ్ మనందరికీ మాట్లాడే శక్తినిచ్చాడు. వినికిడి శక్తి అనుగ్రహించిందీ ఆయనే. మనకు ప్రాణం పోసిందీ ఆయనే’ అని చెప్పసాగారు. అప్పుడు అంధుడు పక్కన ఉన్న ఓ వ్యక్తితో ‘అల్లాహ్ ఎలా ఉంటాడని’ ప్రశ్నించాడు. ‘అల్లాహ్కు భౌతిక రూపం లేదు. ఈ నేత్రాలతో ఆయన్ను చూడలేం’ అన్నాడు. ‘కండ్లున్నవాళ్లు కూడా ఆయన్ను చూసే భాగ్యం లేదన్నమాట. ఇక నాకు కండ్లు లేవన్న బాధ కూడా పోయింది’ అని లోలోపల మురిసిపోయాడు అంధుడు. ప్రవక్త (స) శిష్యుడిగా చేరి దైవసేవలో తరించాడు.
…?ముహమ్మద్ ముజాహిద్