అదొక అడవి. మధ్యలో చిన్న చిన్న గూడేలు. ఒక తొవ్వ ఉండదు.. తోడు ఉండదు. యేండ్ల తరబడి అవే కష్టాలు.. అవే వెతలు. చదువంటే ఏమిటో కూడా తెలియదు. చిరిగిపోయిన బట్టలు.. చింపిరి జుట్లు.. భవిష్యత్ కండ్లముందే కనిపిస్తుంది. అలాంటి అడవి బిడ్డల జీవితాల్లో అక్షర కాంతులు నింపుతున్నారు కొందరు యువకులు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఓ ఐదు గ్రామాలను ప్రపంచం గమనిస్తున్నది. యేండ్ల తరబడి చదువుకు దూరంగా ఉన్న ఆ పల్లెల్లో విద్యా పరిమళాలు వెదజల్లుతున్నారు కొందరు యువకులు. చదువంటే అవగాహన కల్పిస్తూ ఇప్పపూల వనాలను సరస్వతీ నిలయాలుగా మారుస్తున్నారు.
ఒక పర్యటన..
సంతోష్ ఇస్రం, శేశిందర్రెడ్డి, చంద గున్మంతరావు, నరేష్ దూడపాక .. ఒక్కొక్కరిది ఒక్కో బ్యాక్గ్రౌండ్. సేవాగుణమే వారిని ఒకచోటుకి చేర్చింది. సంతోష్ ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుతున్నాడు. రూరల్ ఫొటోగ్రఫీ అతడి అభిరుచి. ప్రాజెక్టుల్లో భాగంగా ట్రైబల్ ఏరియాల్లో తిరుగుతుంటాడు. గత సంవత్సరం కరోనా మొదటి వేవ్లో దేశమంతా లాక్డౌన్ నడుస్తున్నది. పేదలకు, వలసకూలీలకు చాలా ఇబ్బంది అయ్యింది. వారిలో గిరిజన ప్రజలూ ఉన్నారు. సంతోష్ తన మిత్రులతో కలిసి ‘నీలం తోగు’ అనే గూడెంలో పర్యటించాడు. వారంతా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు. మూడు తరాల మనుషులున్నారు. కానీ, ఏ ఒక్కతరానికీ అక్షరంముక్క రాదు. ప్రపంచమంటే ఏమిటో తెలియని అమాయకత్వం. పేదరికాన్ని గెలువలేని బేలతనం. ‘మనవంతుగా ఏం చేయగలం?’ అని చర్చించుకున్నారు.
మొదటి పాఠశాల
బయ్యక్కపేట పరిసర గ్రామాల్లో కొంతకాలం అధ్యయనం చేశారు ముగ్గురూ. అంతటా ఇదే కథ. చదువు లేకుండా, ఎదుగుదల లేకుండా, పౌష్ఠికాహార లోపంతో, అనారోగ్యంపాలైన పిల్లలే కనిపించారు. సంతోష్ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. స్నేహితులకు వివరించి, ఓ శాశ్వత పాఠశాలను నీలంతోగులో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అనుమతి కోసం ప్రయత్నించేలోపు లాక్డౌన్ నిబంధనలు అడ్డొచ్చింది. కానీ ఆలస్యం చేస్తే సమస్య తీవ్రమవుతుందని భావించి, ఆ గ్రామంలోనే ఏడవ తరగతి వరకు చదివిన ఒక అబ్బాయిచేత ట్యూషన్లు చెప్పించారు. తొలుత పిల్లలెవరూ రాలేదు. తల్లిదండ్రులూ ఆసక్తి కనబర్చలేదు. వారికి మెల్లగా చదువుపై అవగాహన కల్పిస్తూ, రోజూ కోడిగుడ్లు పంచుతూ, ఆటలాడిస్తూ, కంప్యూటర్లు చూపిస్తూ రప్పించారు. జూలై 2020లో నీలంతోగులో పాఠశాల ప్రారంభించారు. ఆ యువత చిత్తశుద్ధిని చూసి, భద్రయ్య అనే గ్రామస్తుడు తన గుడిసెను ఇచ్చాడు.
ఐదు గ్రామాల్లో
‘భీమ్ చిల్డ్రన్స్ హ్యాపినెస్ సెంటర్’గా (బీసీహెచ్సీ) నీలం తోగు స్కూల్కు నామకరణం చేశారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు విషయం తెలిసి అభినందించారు. ‘ఐడియా బాగుంది ఇంకా విస్తరించాలి’ అని మెచ్చుకున్నారు. విరాళాలు ఇచ్చేందుకు దాతలూ ముందుకొచ్చారు. ఏదో చిన్న ప్రయత్నం చేద్దాం అనుకున్న సంతోష్ మిత్రబృందం బాధ్యత మరింత పెరిగింది. శాశ్వత ప్రాతిపదికన బీసీహెచ్సీ పాఠశాలలను నిర్వహించేందుకు దాతలు అంగీకరించారు. ప్రాజెక్ట్ నచ్చి సంతోష్ స్నేహితుడు నరేశ్ దూడపాక వీరితో చేరాడు. అందరి సహకారంతో నీలంతోగుతో పాటు బండ్ల పహాడ్, సారలమ్మగుంపు, ముసలమ్మ పెంట, తక్కెళ్లగూడెం వంటి గ్రామాల్లో కూడా పాఠశాలలు ఏర్పాటుచేసి అడవిలో అక్షర యజ్ఞం చేస్తున్నారు.