ఆ మహనీయుడు నడయాడిన చోట ఆధ్యాత్మికత పల్లవించింది. భక్తి ఉద్యమం మళ్లీ పురుడుపోసుకుంది. ఆయన దృష్టిసారించిన నెలవులో మహోన్నతమైన గుళ్లు కొలువుదీరాయి. శిథిల ఆలయాలు ఎన్నిటికో పూర్వవైభవం తీసుకొచ్చిన పుణ్యమూర్తి ఆయన. పేదలను ప్రేమతో ఆదరించాలని సూచించి, ప్రతిజీవిలో పరమాత్మను దర్శించాలని ఉపదేశించి నిజమైన భక్తికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన యతిశేఖరుడు, తెలంగాణ ఆధ్యాత్మిక కెరటం శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ మహాస్వామి వారు. పరమహంస తత్వానికి పర్యాయపదంగా నిలిచిన అవతార పురుషుడి పుణ్య జయంతి సందర్భంగా మదనానంద సరస్వతీ స్వామి తత్వాన్ని అవలోకనం చేసుకుందాం..
వేదకాలం నుంచి భారతీయ భావన ఉదారమైంది, పావనమైంది. మన భారతావనిలో నాటి నుంచి నేటి వరకు పరమహంసల పరమకరుణా కిరణాలు ప్రసరిస్తూనే ఉన్నాయి. పారమార్థిక భావనలను వెదజల్లుతూనే ఉన్నాయి. ఈ పరంపరలో భవసాగరమగ్నులైన మానవులను తరింపజేయడానికి పరమకృపాసాగరులై అవతరించిన ఈశ్వరాంశ సంభూతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ మహాస్వామి. ఆజన్మ బ్రహ్మచారిగా, అన్నదానమే జీవన వ్రతంగా 90 ఏండ్లకుపైగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొసాగించారు. జ్ఞానసిద్ధులు, త్యాగమయ జీవనులు అయిన మదనానంద సరస్వతి తెలంగాణ మాగాణంలో ఆధ్యాత్మిక బీజాలు నాటి, భక్తి ఫలాలు పంచి మహాయోగిగా, మహోన్నత త్యాగిగా భక్తుల హృదయాల్లో నిలిచారు.
భారతావనిలో అన్నపూర్ణగా ప్రసిద్ధిచెందిన తెలంగాణలో మేధావులు ఎందరికో జన్మనిచ్చిన గడ్డ మెతుకు సీమ. మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామంలో సనాతన సంప్రదాయ కుటుంబంలో మదనానంద సరస్వతీ స్వామి జన్మించారు. వీరి తండ్రి రావికోటి నరహరి శర్మ, తల్లి లక్ష్మీనర్సమ్మ. బాల్యం నుంచే ఆధ్యాత్మిక భావనలు పుణికిపుచ్చుకున్న స్వామివారి పూర్వాశ్రమ నామం లక్ష్మీనారాయణ శర్మ. ‘త్యాగే నైకే అమృతత్వ మానశుః’ అన్నమాటలకు అక్షర ఉదాహరణ ఆయన జీవితం. ధర్మ సముద్ధరణకు, నిరంతర అన్నదానానికి పెట్టింది పేరుగా కీర్తి సంపాదించారు. ఆశ్రితులకు శరణాగతి ప్రసాదించి రక్షించారు.
నిరంతరం శ్రమజీవిగా, సత్యవ్రత పరాయణులుగా, ఆచారవంతులుగా తమ జీవితాన్ని దిద్దుకున్నారు. ‘కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠగతైరపి’ అన్నది వారి సందేశం. పూర్వాశ్రమంలో ఆయన వ్యవసాయాన్ని, పురోహితాన్ని చేసేవారు. పెద్ద కుటుంబాన్ని పెద్దతనంతో పోషించారు. వీరు వ్యవసాయం చేసిన సందర్భంలో పండించిన పంటరాశిలో గ్రామంలో అందరికన్నా తక్కువగా ఉండేది. ఇందుకు కారణం వడ్లు నూర్చింది మొదలు ఎవరు వచ్చి అడిగినా.. చాటెడు వడ్లన్నా ఇచ్చేవారు. ‘ఎవరికి అవసరమో వారికి ఆ ధాన్యం భగవంతుడు చేరుస్తాడు’ అని చెప్పేవారు. త్యాగమంటే వాగ్దానం కాదు, ఆచరణాత్మకంగా ఉండాలి అంటుండేవారు.
వ్యవహార దక్షత కలిగి ఉండటంతోపాటు సద్యస్ఫూర్తితో మాట్లాడేవారు. ఉర్దూలోనూ అనర్గళంగా ప్రసంగించేవారు. ఒకసారి న్యాయస్థానంలో ఉర్దూలో వాదించి తమ వ్యాజ్యాన్ని గెలుపొందారు. న్యాయబద్ధంగా తను గెలుచుకున్న భూమిని ప్రతివాదికి దానమిచ్చి తన దాతృత్వాన్ని చాటారు. లౌకిక విషయాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ధర్మ సంస్థాపన కోసం నిరంతరం పరితపించేవారు. జీవితాన్ని ఒక తపస్సుగా భావించేవారు. ఆహార నియమాలు పాటించేవారు. తాను ఆచరించే విధానాలనే ఇతరులకు ఉపదేశించేవారు. సకాలంలో సంధ్యావందనాది కర్మలు చేసేవారు. తను వండిన అన్నం ఎవరికో పెట్టి గానీ తినేవారు కాదు!
స్వధర్మ పరిపాలనలో త్యాగమే జీవన విధానంగా మలుచుకున్నారు. 1972లో సర్వప్రాయశ్చిత్తం చేసుకొని కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఉన్న బసవకళ్యాణ్ చేరుకున్నారు. సదానంద మఠాధిపతులైన పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతీ స్వామివారి అనుగ్రహంతో బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసాశ్రమం స్వీకరించారు. మదనానంద సరస్వతీ స్వామి అని యోగపట్టాను పొందారు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందే పైతర, టేక్మాల్, కొప్పోలుతోపాటు పరిసర గ్రామాలలో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. కొప్పోలులో కఠోర తపస్సు ఆచరించారు. అక్కడ శిథిలావస్థకు చేరుకున్న ఉమాసంగమేశ్వర స్వామి ఆలయాన్ని సముద్ధరణ చేశారు. అనేక రుద్రయాగాలు నిర్వహించారు. మహాక్రతువులు చేశారు. అనేక గ్రామాలు పర్యటించి ఆధ్యాత్మిక ఉద్యమాన్ని చేపట్టారు.
ఆదేశంగా భావించి సిద్దిపేటకు వచ్చిన స్వామివారు అక్కడ సదానంద ఆశ్రమాన్ని స్థాపించారు. చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలను భక్తిపథంలో నడిపారు. ‘కలౌ పార్థివ లింగ పూజనమ్’ అనే అంశాన్ని విపులీకరిస్తూ కోటి పార్థివ లింగాలను చేయించడంలో భక్తులను భాగస్వాములను చేశారు. వాటితో సిద్దిపేటలో ఉమాపార్థివస్వామి (కోటి లింగాల) ఆలయ సముదాయాన్ని నిర్మింపజేశారు. అక్కడే శ్రీ సదానంద ఆశ్రమాన్ని, శ్రీ సదానంద వైదిక పాఠశాలను స్థాపించారు. గురువు ఆదేశాల మేరకు 1990లో బసవకళ్యాణ్లోని సదానంద మఠానికి 65వ అధిపతి అయ్యారు. సదానంద మఠాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేశారు. ఒకసారి మతసామరస్యం గురించి బసవకళ్యాణ్లో ఏర్పాటు చేసిన మానవీయత మహాసభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఉర్దూలో ప్రవచించారు స్వామి. మతమంటే మానవతా పూర్వక జీవన విధానమని, ప్రజలు అనవసరంగా ఆందోళనలతో అలమటించకూడదని, తాము పుట్టిన మతంలోనే సత్యవంతులుగా పేరొందాలని మతసామరస్య సారాన్ని ఉద్బోధించారు.
పీఠాధిపత్యం వహించిన తర్వాత కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో వందలాది జీర్ణాలయాలను పునరుద్ధరించారు. ప్రజలకు నిరంతరం మృత్యుంజయ భజన చేయాలని చెబుతుండేవారు. అన్నదానాన్ని కర్తవ్యంగా నిర్వర్తించాలని బోధించేవారు. ఎందరో శిష్యులకు వివిధ ఉపాసనలను ఉపదేశించారు. గృహస్థ శిష్యులేకాకుండా లోక సముద్ధరణకు నలుగురు యతీశ్వరులను కూడా తీర్చిదిద్దారు. మదనానంద సరస్వతీ స్వామివారు ఆవిర్భావం నుంచి నిత్య చైతన్య పరబ్రహ్మ స్థితులుగా మారే వరకు అనునిత్యం అందరి మేలు కోసం పరితపించిన పరిపూర్ణ పుణ్యమూర్తి. శ్రీస్వామివారు కాషాయాన్ని ధరించిన కొన్నాళ్లకు వాటిని సైతం త్యజించి ‘గోనపట్ట’నే జీవితాంతం ధరించిన నిరాడంబరులు. 2000 సంవత్సరం నవంబర్ 21న వారు బ్రహ్మీభూతులయ్యారు.
బసవకళ్యాణ్లో సదానంద మఠంలో కోటి పార్థివలింగ సహిత ఉమా మేధాదక్షిణామూర్తి, శ్రీ పంచముఖ ఆంజనేయ, నవగ్రహ దేవాలయాలను నిర్మించారు. 1995లో అప్పటి సిద్దిపేట సమీపంలోని రాంపూర్ గ్రామంలో దేవాలయం, విద్యాలయం, వైద్యాలయం అనే ఆలయ త్రయాన్ని ఏర్పాటు చేయడానికి మదనానంద శారదా క్షేత్రాన్ని ఆవిర్భవింపజేశారు. ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి అధి, ప్రత్యధి, కర్మ సాద్గుణ్య, దశ దిక్పాలక సహిత నవగ్రహ మండలి ఆలయం, స్ఫటిక లింగం కొలువుదీరిన శివాలయం, శారదా శంకరాచార్యాది దేవతామూర్తులతో కూడిన పెద్ద దేవాలయ సముదాయాన్ని స్థాపించారు.
సదానంద మఠస్వాములది ఆది దత్త సంప్రదాయం. అందుకే వారందరి దీక్షా నామధేయాలలో అవధూత స్వరూపమైన ‘ఆనంద సరస్వతీ’ అనే బిరుదు ఉంటుంది. ఆ పరంపరలో సదానంద పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ మదనానంద సరస్వతీ స్వామివారు అపర శివుడి అవతారమూర్తిగా భాసిల్లారు.
…? మరుమాముల దత్తాత్రేయ శర్మ 94410 39146