మోక్షానికి సోపానం సాధన. సంసార సాగరాన్ని ఈదుతూ సాధన సాధ్యమా? అందరివల్లా కాకపోవచ్చు. కానీ, సద్గురువులను ఆశ్రయిస్తే తప్పక దారి దొరుకుతుంది. అలాంటి సహజ మార్గాన్ని ప్రపంచానికి నిర్దేశించారు మాతాజీ నిర్మలాదేవి. సహజ యోగ పద్ధతిని పరిచయం చేసి మనిషిలోని చైతన్యాన్ని తట్టి లేపారామె.
మనిషిలో నిద్రాణ స్థితిలో ఉన్న భగవత్ శక్తిని జాగృతం చేసి, చుట్టూ ఉన్న పరమై చైతన్యశక్తితో అనుసంధానం చేసే వినూత్న ప్రక్రియగా చెప్పే ‘సహజ యోగ’ సిద్ధాంత కర్త ఆమె. కుండలినీ శక్తిని చైతన్యపరిచి మనిషి ప్రవర్తనలో అనూహ్యమైన పరివర్తనకు సహజ యోగ ద్వారా నాంది పలికారామె. దాదాపు 51 ఏండ్ల కిందట మాతాజీ నెలకొల్పిన ఈ సిద్ధాంతం విశ్వవ్యాప్తమైంది.
ఎందరో సహజ యోగ పద్ధతిని అనుసరిస్తూ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు. జీవితాలను తీర్చిదిద్దుకుంటున్నారు. ఇదంతా మాతా నిర్మలాదేవి అనుగ్రహం అని చెబుతారంతా! 1923 మార్చి 21న నిర్మలాదేవి మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాలో జన్మించారు. కాస్త పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. యువతిగా ఉన్నప్పుడు 1942 ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలు పంచుకున్నారు. నిర్మలాదేవిలోని ఆధ్యాత్మిక ఆసక్తిని గమనించిన మహాత్మాగాంధీ, తన ఆశ్రమంలో నిర్వహించే ప్రార్థనల విషయమై ఆమెను సంప్రదించిన సందర్భాలూ ఉన్నాయట. 1947లో వివాహం తర్వాత ఇల్లాలిగా, పిల్లల తల్లిగా, గృహస్తురాలిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారామె. 1970లో పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికత దిశగా అడుగులు వేశారు.సహజ యోగ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక బీజాలు నాటారు. 98వ జయంతి సందర్భంగా మాతాజీ ఆశ్రమాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తద్వారా నిర్వాహకులు సహజ యోగ ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.