భక్తికి కావాల్సింది నిర్మల హృదయం. సత్కర్మలు ఆచరిస్తూ, పవిత్ర మనసుతో భగవానుడిని ఆరాధించిన భక్తులు పుణ్యలోకాలు పొందుతారని నిరూపిస్తుంది రామాయణంలోని శబరి గాథ. శబరి ఆటవిక జాతిలో పుట్టింది. జన్మాంతర పుణ్యఫలం ఆమెకు మాతంగ ముని ఆశ్రమంలో రుషులకు, మునులకు సేవ చేసే భాగ్యం కల్పించింది. నిరంతరం భగవన్నామ స్మరణతో తరించింది. వేదవేదాంగాల జ్ఞానాన్ని సంపాదించింది. అష్టాంగ యోగాలు, ఆసనాల సాధనతో తపస్వినిగా పేరుగాంచింది శబరి.
మాతంగ ముని ఆశ్రమంలో గురువులు తమ జన్మ సార్థకత పొంది స్వర్గానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వారిని తీసుకెళ్లడానికి దివ్య విమానం వచ్చింది. మునులందరూ దాన్ని అధిరోహించారు. ఆశ్రమంలో ఉన్న శబరితో మాతంగ ముని ‘విష్ణుమూర్తి రామచంద్రుడిగా లక్ష్మణ సమేతుడై ఆశ్రమానికి రానున్నాడు, ఆ పురుషోత్తముడికి ఆతిథ్యం ఇచ్చి జన్మ చరితార్థం చేసుకో!’ అని పలికి మిగతా మునులతో కలిసి స్వర్గానికి వెళ్లిపోయాడు.
శబరి ఆశ్రమంలోనే ఉండిపోయింది. ఈ భక్తురాలి పుట్టుక వెనుక పలు కథలున్నాయి. కంబ రామాయణాన్ని అనుసరించి శబరి అంతకుముందు జన్మలో గంధర్వ రాజైన చిత్రకవకుని బిడ్డగా పుట్టింది. ఆమె పేరు మాలిని. ఆమె వివాహం వీతిహోత్రునితో జరుగుతుంది. ఆయన నిరంతరం జప, యజ్ఞ, హోమాలతో కాలం గడిపేవాడు. భర్తకు తగ్గట్టుగా మాలిని భక్తి ప్రపత్తులతో ఆదర్శ గృహిణిగా ఉండేది. అయితే, ఒకానొక సందర్భంలో మాలినిని అనుమానిస్తాడు వీతిహోత్రుడు. శబర కన్యగా జన్మించమని శపిస్తాడు. మాలిని తన నిష్కల్మష హృదయాన్ని నిరూపించగా, త్రేతాయుగంలో రామ దర్శనంతో శాప విమోచనం అవుతుందని చెబుతాడు.
రాముడి రాక కోసం శబరి ఎదురుచూపులు మొదలయ్యాయి. ‘ఏ రోజుకారోజు ఈ రోజు నా రాముడు వస్తాడు’ అనుకునేది. వేకువజామునే నిద్రలేచి కల్లాపి జల్లి, ముగ్గులు పెట్టి వాకిలిని అందంగా తీర్చిదిద్దేది. కొమ్మనడిగి పూలు, పుట్టనడిగి పట్టు తేనె తెచ్చి నిత్యం సిద్ధంగా ఉంచేది. రకరకాల పండ్లు తెచ్చిపెట్టేది. రోజంతా ఎదురుచూసినా రాముడు రాకపోయేసరికి దిగులుతో రోజు ముగించేది. మళ్లీ మర్నాడు మామూలే! ఇలా పదమూడేండ్లు గడిచిపోయాయి. శబరి మాత్రం రాముడు ఎప్పుడొస్తాడా, ఆ నీలమేఘ శ్యాముడిని ఎప్పుడెప్పుడు దర్శిస్తానా అని పరితపించేది. కబందుడి నోట శబరి భక్తి గొప్పదనాన్ని విన్న రాముడు మాతంగ ముని ఆశ్రమానికి వెళ్తాడు. రాఘవుడి దర్శనం కోసం ఆరాటంతో ఉన్న శబరికి గొప్ప ఊరట కలిగింది. దాశరథిని ఆప్యాయంగా చూస్తూ తన్మయురాలైంది. ‘నా విష్ణుః పృథ్వీపతిః’ అంటూ సాదరంగా స్వాగతించింది. శ్రీరాముడి పాదాలు కడిగి, కూర్చోవడానికి ఆసనం చూపింది.
మయాతు వివిధం వన్యం సంచితం పురుషర్షభ
తవార్థే పురుష వ్యాఘ్ర పంపాయాస్తీర సంభవమ్
(అరణ్యకాండ 74-17)
అని శబరి తాను సేకరించిన పండ్లతో శ్రీరాముడికి ఆతిథ్యమిచ్చింది. అయితే, శబరి ఎంగిలి పండ్లను ఇస్తే రాముడు వాటిని ప్రేమగా స్వీకరించాడని జనశ్రుతి గాథలు ఉన్నాయి. పద్మ పురాణంలో చెప్పినట్లు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు యోగ్యమైనవాటిని పరీక్షించి ఇవ్వాలనే మర్యాద శబరి పాటించిందన్న సమర్థనలున్నాయి. జీవితానుభవం ఉన్న ఆ వృద్ధురాలు రేగుపండ్లను ఎంగిలి చేయకుండా గోరుతో గిల్లి, రుచి చూసి రాముడికి ఇచ్చిందన్న వ్యాఖ్యానాలూ ఉన్నాయి. ఎలా ఇస్తేనేం, పరిపూర్ణ భక్తిభావంతో, నిష్కల్మషమైన మనసుతో ఆతిథ్యమిస్తే భగవానుడు తప్పక స్వీకరిస్తాడన్న సందేశాన్ని చాటింది శబరి. రాముని ఆనతి మేరకు యోగాగ్నిలో తనువు త్యాగం చేసి స్వర్గానికి చేరుకుంది. గీతాచార్యుడు చెప్పినట్లు ప్రతిఫలం ఆశించకుండా ఫలం, పుష్పం, తోయం ఏది సమర్పించినా దైవానుగ్రహం లభిస్తుందని భక్త శబరి గాథ తెలియజేస్తుంది.
-మాడుగుల నారాయణమూర్తి , 94411 39106