‘తపశ్చారిణీ త్వంహి తాపత్రయ నివారిణీమ్
బ్రహ్మరూప ధరా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహమ్
శంకరప్రియా త్వంహి భుక్తి ముక్తి దాయినీ
శాంతిదా జ్ఞానదా బ్రహ్మచారిణీ ప్రణమామ్యహమ్’
శక్తిమయం అయిన నవరాత్రుల్లో ప్రార్థించే నవదుర్గా రూపాలు అత్యంత విశిష్టమైనవి. శక్తితో ఉన్నవారు శక్తిని సంపాదించుకోగలుగుతారు. శక్తికి దూరమైన వారు తాము నిత్యజీవితంలో ఏదీ సాధించలేక, శరీరం, మనసు తమ అధీనంలో లేక నిరంతరం బాధలకు, వేదనకు గురవుతుంటారు. శక్తిని సంపాదించుకొని అత్యున్నత కార్యక్రమాలను అతి సన్నిహితంగా నిర్వహించడా నికే మానవ జన్మ వచ్చిందనే విషయం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ లోకంలో శక్తి లేని ప్రదేశం లేదు. ఏ పనికి ఎంత శక్తి అవసరమో.. అంత ఉన్నప్పుడే ఆ పని పూర్తవుతుంది. సూర్యుడిలోనూ, ప్రకృతిలోనూ అనంతమైన శక్తి ఉండి మనపై ప్రసరిస్తుంటుంది. అదే మనకు ‘విటమిన్ డి’ రూపంలో, వృక్షాలకు ఆహారంగా, ఐశ్వర్యంగా, సూక్ష్మజీవి నాశనకారిగా ఉపయోగపడుతూ ఉంది. అటువంటి శక్తిని మనం నిరంతరం తలచుకుంటూ దానితోనే ఎక్కువ సేపు గడుపుతూ ఉంటే మనకు అధికమైన శక్తి వస్తూనే ఉంటుంది. ఈ నవరా త్రులు ఆ శక్తిని పొందేందుకు తగిన దీక్షా సమయాలు.
‘దధానా కర పద్మాభ్యాం అక్షమాలా కమండలా
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా॥’
దేవీ నవరాత్రులలో రెండో రోజున ప్రార్థన చేసే అమ్మవారి రూపం ‘బ్రహ్మచారి ణి’. కుడి చేతిలో అక్షమాలను, ఎడమ చేతిలో కమండలాన్ని ధరించి, అత్యుత్త మ శ్వేత వస్ర్తాలను ధరించి స్వచ్ఛతకు, జ్ఞానానికి, తేజస్సుకు ప్రతీకగా ఉన్న అమ్మవారి స్వరూపమే బ్రహ్మచారిణి. పరమేశ్వరుణ్ని భర్తగా పొందడానికి పార్వతీదేవి తీవ్రంగా తపస్సు చేసిన రూపం ఇది. ఈ తపస్సు వల్లనే పరమేశ్వ రుడిని భర్తగా పొందింది పార్వతీదేవి. ఒక అత్యుత్తమ స్థాయికి తాము చేరాలం టే తమలోని అజ్ఞానం, అహంకారం, రాగద్వేషాలన్నీ తొలగిపోవాలి. అప్పుడే వ్యక్తి స్వచ్ఛంగా మారుతాడు. జ్ఞానం, వైరాగ్యం ఏర్పడిన వారికే ప్రపంచం, విశ్వం ప్రశాంతంగా కనిపిస్తాయి. ఇది లేని వానికి అన్నీ దోషాలే కనిపిస్తాయి. ఈ జ్ఞాన వైరాగ్య వ్యవహారాలకు ప్రతీక తెలుపు. ఇటువంటి తెల్లని వస్ర్తాలను ధరించి తమ హృదయ స్వచ్ఛతను ప్రదర్శించి, మనని అనుసరించమని చెప్పే అమ్మవారి రూపమే ‘బ్రహ్మచారిణి’. మన మనస్సు దేనిపై ఎక్కువగా లగ్నమవు తుందో అదే తపస్సు అవుతుంది. అటువంటి తపస్సు కేవలం అత్యుత్తమ శక్తిమీద మాత్రమే కేంద్రీకరించాలని, మనస్సు పక్కదారులకు పోకుండా చేతిలో ధరించే అక్షమాల ద్వారా ఆధ్యాత్మిక సాధన సాధ్యమని చెప్పే రూపమే బ్రహ్మచారిణి.
బ్రహ్మమంటే కాలం. బ్రహ్మమంటే ప్రకృతి. కాలాన్ని, ప్రకృతిని సరైన విధంగా గమనిస్తూ, దానితో మమేకమై, సమయాన్ని వ్యర్థం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా ఉండటమే మన జీవిత లక్ష్యం కావాలి. బ్రహ్మచారిణి అమ్మవారు మనకు ఇచ్చే సందేశం కూడా ఇదే. కాలాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని ఉపాసిస్తూ మన మనస్సును లౌకిక వ్యవహారాల్లో కాకుండా ఈ విశ్వమయమైన స్వచ్ఛ వ్యవహారాల్లో కేంద్రీకరించినవారికి అత్యుత్తమ శక్తి లభిస్తుంది. అమ్మవా రి ఉపాసనలోని పరమతత్వమూ ఇదే. సూర్య కిరణాల్లోని తెల్లని తెలుపు, తేజస్సు ఈ భూమిపై పడినప్పుడు మనకు కలిగే జ్ఞానం ఎటువంటిదో, అటువంటి జ్ఞానమే బ్రహ్మచారిణీ మాత ఉపాసన వల్ల కలుగుతుంది. వెలుగు వల్ల చీకటి తొలగినట్లు, స్వచ్ఛత, జ్ఞానమయమైన అమ్మవారి తేజస్సు వల్ల నిరంతర ప్రశాంతతను సాధించవచ్చు.