యుగయుగాలుగా ధర్మానికి ఆపద కలిగినప్పుడు ఏదో ఒక రూపంలో భగవానుడు అవతరిస్తుంటాడు. అవైదిక మతాల ప్రాబల్యం పెరిగి అధర్మం తాండవించినప్పుడు ప్రజలకు వేద ప్రతిపాదిత విషయాలతో ధర్మమార్గాన్ని నిర్దేశిస్తాడు. అధర్మం పెచ్చరిల్లినప్పుడు ధర్మ సంస్థాపన కోసం తాను అవతరిస్తానని భగవానుడే స్వయంగా ప్రకటించాడు. యుగధర్మాల మేరకు ‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ’కై పరమాత్మ త్రేతాయుగంలో శ్రీరాముడిలా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిలా జన్మించి, రాక్షసులను సంహరించి లోకోపకారం చేశాడు.
కలియుగానికి వచ్చేసరికి రాక్షసులు లేకపోయినా రాక్షస భావజాలాన్ని తొలగించి వారికి సన్మార్గం ఉపదేశించడానికి ‘శంభోర్మూర్తి శ్చతి భువనీ శంకరాచార్య రూపా’ అన్నట్టుగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది శంకరాచార్యులుగా అవతరించారు. శ్రీశంకరులు లోకానికి మహోపకారం చేశారు. ఈ రోజు మనం ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే అది వారి అనుగ్రహమే! వేద ప్రామాణికతను తృణీకరించి, దానికి విరుద్ధంగా ఉన్న 72 మతాలను ఖండించి, వేద ప్రతిపాదితమైన ధర్మాన్ని ప్రబోధించారు శంకరులు.
వారు సూచించిన మార్గం శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలో నలుదిశల్లో నాలుగు పీఠాలను స్థాపించారు. అవి: తూర్పున పూరి, దక్షిణాన శృంగేరి, పశ్చిమాన ద్వారక, ఉత్తరాన బదరీ పీఠాలు. వీటిలో ప్రముఖమైంది శృంగేరి శారదా పీఠం. దీనికి తన శిష్యుడు సురేశ్వరాచార్యులను పీఠాధిపతిగా నియమించారు. వారి నుంచి ప్రస్తుత 36వ పీఠాధిపతి సద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వరకు అందరూ శంకరాచార్య స్వరూపులే. ‘అస్మత్ పీఠే సమారూఢః పరివ్రాడుక్త లక్షణః అహమేవీతి విజ్ఞీయః’ అని భగవత్పాదులు సెలవిచ్చారు. ఈ పీఠాన్ని అధిరోహించిన వారంతా సాక్షాత్తు శంకర స్వరూపులే!
శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి అతి చిన్న వయసులోనే సంస్కృతంలో విశేష పాండిత్యాన్ని సంపాదించారు. బాల్యావస్థలోనే అపార వైరాగ్యభావంతో ఉండేవారు. వారి పూర్వాశ్రమ నామం శ్రీసీతారామాంజనేయులు. ఒకసారి విద్యాతీర్థ మహాస్వామి విజయయాత్రలో ఉండగా స్వామివారిని దర్శించి వారితో సంస్కృతంలో సంభాషించారు శ్రీసీతారామాంజనేయులు. మహాస్వామి చాలా ఆనందించి ఆశీర్వదించారు. ఆ క్షణమే శృంగేరి గురువుల సాన్నిధ్యంలో శాస్ర్తాధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. తర్వాత శ్రీసీతారామాంజనేయులు శృంగేరి పీఠానికి వెళ్లి అతితక్కువ సమయంలోనే వేదశాస్ర్తాల అధ్యయనం పూర్తిచేశారు. ఆ పిల్లవానిలోని పాండిత్యాన్ని, వైరాగ్యాన్ని చూసిన మహాస్వామి ఎంతో ఆనందభరితులయ్యేవారు. 1974లో శిష్య స్వీకారం చేసి శ్రీసీతారామాంజనేయులుకు ‘భారతీ తీర్థ’ యోగపట్టాను అనుగ్రహించారు. శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి 1989లో శృంగేరి శారదా పీఠాధిపతిగా అవతరించారు. నాటి నుంచి సనాతన ధర్మపరిరక్షణకు ధర్మప్రచారం చేస్తున్నారు. వేద పాఠశాలలు, గోశాలలు నిర్మించి వైదికధర్మాన్ని పరిరక్షిస్తున్నారు.
ఎక్కడ పాండిత్యం ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండదు. ఎక్కడ వైరాగ్యం ఉంటుందో అక్కడ పాండిత్యం ఉండదు. కానీ, ఈ రెండూ మూర్తీభవించిన జగద్గురువు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి. మామూలు వ్యక్తి నుంచి మహాపండితుల వరకు వారివారి స్థాయిని బట్టి ధర్మప్రబోధం చేయడం వీరివల్లే సాధ్యం. మహాస్వామివారు అత్యంత శిష్యవాత్సల్యం కలవారు. సాక్షాత్తు శారదాంబనే స్వామిరూపంలో నడయాడుతున్నదని భావిస్తుంటారు భక్తులు. జగద్గురువు ప్రస్తుత ‘సప్తతి మహోత్సవం’ సందర్భంగా అనేక వైదిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శృంగేరిలో లోక కల్యాణార్థమై ఆయుత చండీయాగం, అతిరుద్రయాగం, కోటి కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయితే చండీ అమ్మవారి ఆరాధన (యజ్ఞయాగాలు) జరుగుతాయో ఆ దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. ఎలాంటి దుఃఖాలూ అక్కడి ప్రజల దరి చేరవు. అకాల మరణాలు లేకుండా వారంతా సుఖసంతోషాలతో జీవిస్తారు. ఈ శుభవేళ మనమంతా మహాస్వామి పాదాలకు నమస్కరించి, వారి మార్గంలోనే నడుస్తూ, ధర్మాచరణ కోసం కంకణబద్ధులమవుదాం.
వ్యాసోఝుల ,గోపీకృష్ణశర్మ