లక్నో: తుపాకీతో సెల్ఫీ తీసుకుంటూ, పొరపాటున ట్రిగర్ నొక్కిన యువకుడు తనను తాను కాల్చుకుని మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల సుచిత్ ఆదివారం ఉదయం తన గదిలో గన్తో సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఒక చేతిలోని రివాల్వర్ను తల వద్ద ఉంచుకుని మరో చేతిలోని మొబైల్ ఫోన్లో ఫొటో తీసుకుంటున్నాడు. అయితే పొరపాటున ట్రిగర్ నొక్కాడు. దీంతో బుల్లెట్ అతడి తలలోకి దూసుకెళ్లింది.
కాగా, తుపాకీ పేలిన శబ్ధం విన్న కుటుంబ సభ్యులు వెంటనే సుచిత్ గదికి వచ్చారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ యువకుడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సుచిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు సుచిత్ మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని సఫీపూర్ సర్కిల్ ఆఫీసర్ అంజనీ కుమార్ రాయ్ తెలిపారు. యువకుడి కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తామని చెప్పారు. వారు చెబుతున్నట్లుగా సుచిత్ గన్తో సెల్ఫీ తీసుకుంటూ పొరపాటున కాల్చుకున్నాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది దర్యాప్తులో తేలుతుందని అన్నారు.