ముంబై: బర్త్డే కేక్ను కత్తితో కోసిన యువకులతోపాటు దానిని తయారు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. గత నెలలో రితేష్ పేకే, ఆదిత్య నలవాడే అనే ఇద్దరు యువకులు జనతా వాసహత్లో బర్త్డే కేక్ను కత్తితో కోశారు. కొడవలి మాదిరి పదునైన ఆయుధాలను చేతిలో పట్టుకుని హంగామా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పోలీసుల దృష్టికి వచ్చింది.
దీంతో పదునైన ఆయుధాలు కలిగి ఉన్నారన్న నేరంపై దత్తవాడి పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. కత్తితోపాటు వారి వద్ద ఉన్న 7 ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తయారు చేసిన భోర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ పవార్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు యువకులు మరో నాలుగు ఆయుధాల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు అతడు చెప్పాడు.
కాగా, పదునైన పరికరాలను తయారు చేయడం, అమ్మడం నేరం కాదని, అయితే వాటిని ఎవరికి అమ్మారన్న వివరాలను రికార్డు చేయకపోవడం నేరం కిందకు వస్తుందని పోలీసులు వెల్లడించారు.