సికింద్రాబాద్ : రాత్రి అంతా స్నేహితులతో సరదాగా గడిపిన ఓ యువకుడు తన ఇంటిలోని ఓ గదిలో తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున్ కాలనీలో చోటుచేసుకుంది.
సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ కు చెందిన కమల్ రానా(25) నిరుద్యోగి. రానా గత కొంతకాలంగా ఓల్డ్ బోయిన్పల్లి మల్లికార్జున కాలనీలోని ఓ ఇంటిలోని రెండవ అంతస్తులో తన తల్లి సావిత్రి, తమ్ముడు కరణ్ రానాతో కలిసి నివాసముంటున్నారు.
శుక్రవారం రాత్రి తల్లి సావిత్రి, తమ్ముడు కరణ్లు వారి మామయ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే పడుకుని శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు . తలుపు గడి లోపలి నుండి పెట్టి ఉండడంతో చాలా సేపు తలుపు తట్టి, ఎంత పిలిచినా కమల్ రానా పలకలేదు.
దీంతో అనుమానం వచ్చిన కరణ్ పక్కనే ఉన్న కిటికీని పగలకొట్టి లోనికి ప్రవేశించి చూడగా కమల్ రానా ఇంట్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కి బెడ్ షీట్తో ఉరి వేసుకొని కనిపించాడు. ఒక్కసారిగా కంగుతిన్న కరణ్ రానా ఇంటి తలుపులు తీసి తల్లిని లోపలికి పిలిచి కరణ్ రానాను కిందకు దించి చూశారు.
అయితే కమల్ రానా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించిన తల్లి, తమ్ముడు ఇంటి పక్క వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో అన్ని కోణాలలో పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు.
ఈ క్రమంలో మృతుడి బంధువు శ్రీకృష్ణ రానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కాగా గత కొంతకాలంగా మృతుడు ఫ్యాకర్స్, అండ్ మూవర్స్ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు అందులో నష్టం వాటిల్లడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులుకు వెల్లడించారు.