కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వర్క్ ఫ్రం హోం విధానంతో ఒక మోసగాళ్ల ముఠా కోట్లు సంపాదించింది. వందల మందిని భారీ జీతాల ఆశ చూపి వారిని దోచుకున్న ఆ ముఠా గురించి పోలీసులకు దాదాపు 60 ఫిర్యాదులు అందాయి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీ పోలీసులకు ఇటీవల దాదాపు 60 మంది తాము మోసపోయామని ఫిర్యాదు చేశారు. బాధితులంతా బాగా చదువుకున్నావారు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు. పోలీసుల ఈ కేసులో విచారణ చేసి చాలా చాకచక్యంగా.. ఆ దొంగలను పట్టుకున్నారు. వారిలో ముగ్గురు పురుషులు కాగా.. ఒక మహిళ కూడా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆ దుండగలు ఇంటర్నెట్లో ఉద్యోగాల వెతికే వారి సీవీని తీసుకొని వారికి ఆ ముఠాలోని మహిళ ఫోన్ చేసేది. ఆ తరువాత భారీ జీతాల ఆశచూపి, వారిని ఇంటి నుంచే పనిచేసే వెసలుబాటు కలిగిస్తున్నట్లు మోసగాళ్లు నమ్మించారు.
ఉద్యోగంలో చేరే ముందు బాధితులతో ఆ మోసగాళ్లు ఒక ఒప్పందం చేసుకునేవారు. దాని ప్రకారం ఇచ్చిన పని సకాలం పూర్తిచేయకపోతే సంస్థకు చాల నష్టం వాటిల్లుతుందని అందువల్ల ఇచ్చిన గడువులో పని పూర్తిచేయని ఉద్యోగులు లక్షల్లో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగం చేసేవారిపై మోయలేనంత పనిభారం మోపేవారు.
దీంతో బాధితుల నుంచి నష్టపరిహారం పేరిట లక్షల రూపాయలు లాగేశారు. ఇవ్వని వారికి జైలు పంపుతామని బెదిరించారు. కొంత కాలం తరువాత మోసపోయిన కొందరు ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నేరస్తులను చాలా చాకచాక్యంగా పట్టుకున్నారు. పోలీసుల తరపు నుంచి ఒక వ్యక్తి ముందుగా నేరస్తులను ఉద్యోగం కావాలంటూ సంప్రదించాడు. ఆ తరువాత ఈ కార్పొరేట్ మోసగాళ్లు తాము పన్నిన వలలో తామే చిక్కుకున్నారు.