బెంగళూర్ : ప్రియుడు నిర్వహిస్తున్న గంజాయి వ్యాపారంలో పాలుపంచుకునేందుకు మహిళ తాను చేస్తున్న ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కటకటాలపాలైన ఉదంతం బెంగళూర్ లో చోటుచేసుకుంది. గంజాయి సరఫరా చేస్తున్న పాతికేండ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీకి చెందిన రేణుక అలియాస్ ఆద్య, బిహార్ కు చెందిన సిద్ధార్ధ్ గంజాయి వ్యాపారంలో చేతులు కలిపారు.
రేణుక బాయ్ఫ్రెండ్ ఈ నేరంలో ప్రధాన సూత్రధారి సిద్ధార్ధ్ పరారీలో ఉన్నాడు. వీరిద్దరూ కాలేజ్ లో చదువుతుండగా స్నేహితులుగా మారి ఆపై ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత సిద్ధార్ధ్ డ్రగ్స్ సరఫరాదారుగా మారగా రేణుక ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. తన జీతంతో సంత్రుప్తి చెందని రేణుక ఈజీ మనీ కోసం ప్రియుడితో కలిసి చీకటి దందాలో పాలుపంచుకుంది. ఏప్రిల్ చివరి వారంలో ఆమె మరతహళ్లిలోని హోటల్ లో రూమ్ బుక్ చేయగా ఆమె బాయ్ ఫ్రెండ్, అతడి సహచరుడు ఒడిషా నుంచి విశాఖపట్నం మీదుగా గంజాయిని తెప్పించారు.
లాక్డౌన్ తో నగరంలో గంజాయికి కొరత ఉండటంతో అధిక ధరలకు విక్రయించాలని సిద్ధార్ధ్ తన ప్రియురాలు రేణుక, తన అనుచరుడు సుధాంశ్ లను కోరాడు. ఆపై గంజాయి విక్రయం, సరఫరాలపై సమాచారం అందడంతో జూన్ 6న పోలీసులు జరిపిన దాడుల్లో రేణుకను అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 2500 గ్రాముల గంజాయి ప్యాకెట్లు, రూ 6500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సిద్ధార్ధ్ ను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు తీవ్రతరం చేశారు.