తిరువనంతపురం: బ్రేకప్కు బాయ్ఫ్రెండ్ ఒప్పుకోకపోవడంతో ప్రియురాలు విషం ఇచ్చి అతడ్ని చంపింది. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఆత్మహత్యకు యత్నించింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. రేడియాలజీ కోర్సు చదువుతున్న 23 ఏళ్ల షారోన్ రాజ్, 22 ఏళ్ల గ్రీష్మ మధ్య కాలేజీలో ఏర్పడిన పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ సమయంలో గ్రీష్మకు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరింది. అయినప్పటికీ రాజ్, గ్రీష్మ తమ సంబంధాన్ని కొనసాగించారు. అయితే ఇటీవల మళ్లీ వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.
కాగా, మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్ కావడంతో రాజ్ను వదిలించుకునేందుకు గ్రీష్మ అనేక ప్రయత్నాలు చేసింది. బ్రేకప్ చేసుకుందామని తొలుత అతడితో సున్నితంగా చెప్పింది. తన జాతకం ప్రకారం పెళ్లి చేసుకుంటే అతడు చనిపోతాడంటూ కథలు చెప్పింది. అయినప్పటికీ బ్రేకప్కు రాజ్ ఒప్పుకోలేదు. దీంతో అతడ్ని హత్య చేసేందుకు గ్రీష్మ ప్లాన్ చేసింది. అక్టోబర్ 14న రాజ్ను తన ఇంటికి పిలిచింది. ఆయుర్వేద కషాయంలో పురుగుల మందు కలిపి ఇచ్చింది. అది తాగిన రాజ్ వాంతి చేసుకున్నాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
తీవ్ర అస్వతస్థతకు గురైన ఆ యువకుడు తిరువనంతపురం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతడి ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 20న అతడి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే గ్రీష్మపై అతడు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. చికిత్స పొందుతూ అక్టోబర్ 25న చనిపోయాడు.
మరోవైపు రాజ్ మరణానికి గ్రీష్మ, ఆమె కుటుంబం కారణమని అతడి కుటుంబ సభ్యులు అనుమానించి
పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్ సోదరుడు గ్రీష్మకు పలుమార్లు ఫోన్ చేసి అతడితో ఏం తాగించింది అన్నది అడిగాడు. అయితే భయంతో ఆమె ఏమీ చెప్పలేదు.
చివరకు పోలీసులు గ్రీష్మను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమెను 8 గంటలపాటు ప్రశ్నించగా రాజ్కు విషం ఇచ్చినట్లు ఒప్పుకుంది. దీంతో ఆ యువతిని పోలీస్ కస్టడీలో ఉంచారు. అయితే గత రాత్రి టాయిలెట్ క్లీనర్ తాగిన ఆమె ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆ యువతిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడించారు.