ముంబై: లక్ష రుణం కోసం ఒక మహిళ ఆన్లైన్ మోసంలో రూ.14.5 లక్షలు పోగొట్టుకుంది. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల మహిళ తండ్రి ఒక కంపెనీకి బిజినెస్ హెడ్గా పని చేశారు. రిటైర్మెంట్ తర్వాత రూ.18 లక్షలను కుమార్తె బ్యాంకు ఖాతాలో వేశారు. ఆ మహిళ తన వ్యక్తిగత అవసరాల కోసం లక్ష వాడింది. లోన్ తీసుకుని ఆ లక్షను ఖాతాలో జమ చేయాలని భావించింది.
జూలై 24న ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. లోన్ ఇస్తామని చెప్పగా ఆమె అంగీకరించింది. ప్రోసెస్ ఫీజు కింద రూ.2,600 చెల్లించాలని అతడు చెప్పాడు. ఆ మహిళ ప్రోసెస్ ఫీజు చెల్లించడంతోపాటు రుణ మంజూరుకు అవసమైన పత్రాలు కూడా ఇచ్చింది.
అయితే లోన్ మంజూరు కాకపోవడంతో ఆ ఫైనాన్స్ కంపెనీకి కాల్ చేసింది. అయితే ఆమెతో మొదట మాట్లాడిన వ్యక్తికి కరోనా వచ్చిందని మరో వ్యక్తి తెలిపాడు. ఆమె లోన్ సంగతి తాను చూస్తానని అన్నాడు. దీనికి పలుమార్లు లావాదేవీలు చేయాల్సి ఉంటుందని, చివరకు మొత్తం డబ్బులు అందుతాయని అతడు చెప్పాడు.
దీంతో ఆ మహిళ జూలై-సెప్టెంబర్ మధ్యలో రూ.14.47 లక్షలు చెల్లించింది. చివరకు తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సాంకేతిక ఆధారాలతో నిందితులను పోలీసులు గుర్తించారు. రాజ్ కుండే, అంజుమన్ షావ్లపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.