Woman Suicide | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. అత్తను, భర్తను కరోనా బలి తీసుకుంది. ఇక కోడలు, ఆమె కూతురు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పోషణ భారమైంది. కోడలు బట్టలు కుట్టడం ప్రారంభించింది. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తోంది.. కానీ భర్త లేని జీవితాన్ని గడపడం ఆమెకు కష్టంగా మారింది. దీంతో ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తన ఐదేండ్ల కూతుర్ని అనాథను చేసింది. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ మోర్దాబాద్ జిల్లాలోని బుద్ధి విహార్లో వెలుగు చూసింది.
బుద్ధి విహార్కు చెందిన దినేశ్ ప్రతాప్ సింగ్, ప్రీతి సింగ్ తోమర్(35) దంపతులకు ఓ కూతురు ఉంది. ప్రతాప్ సింగ్ తల్లి కూడా వీరితోనే కలిసి ఉంటోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ప్రతాప్ సింగ్, ఆయన తల్లి కరోనా బారిన పడి చనిపోయారు. ప్రీతి సింగ్, తన కూతురు గార్గి(5) కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే కుటుంబాన్ని పోషించేందుకు ప్రీతి సింగ్ బట్టలు కుట్టడం ప్రారంభించింది. ఆర్థికంగా గడుస్తున్నప్పటికీ, భర్త లేకుండా జీవించడం ఆమెకు కష్టంగా మారింది. తన భర్తే గుర్తుకు రావడంతో తన జీవిత ప్రయాణాన్ని ముందుకు సాగించ లేకపోయింది.
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ప్రీతి సింగ్ ఇంట్లోనే చీరతో ఉరేసుకుంది. అయితే పొద్దున్నే నిద్ర లేచిన కూతురు.. అమ్మా అమ్మా అంటూ పిలిచింది. కానీ స్పందన లేదు. ఫ్యాన్కు వేలాడుతున్న తల్లి కాళ్లను పట్టుకుని అమ్మా అని అరిచింది. అయినా ఎలాంటి స్పందన లేదు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బిడ్డ.. ఇంటి గేటు వద్దకు వచ్చి ఏడ్వసాగింది. ఇరుగుపొరుగు వారు పాపను చేరదీసి.. ఏం జరిగిందని ప్రశ్నించారు. అమ్మ ఫ్యాన్కు వేలాడుతుందని తెలిపింది. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రీతి సింగ్ ఇంటికి చేరుకున్న పోలీసులు.. ఫ్యాన్కు వేలాడుతున్న మహిళను చూసి షాక్ అయ్యారు. అక్కడ ఓ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తన బిడ్డ గార్గిని ఉద్దేశించి.. ఆ తల్లి సూసైడ్ నోట్లో ఇలా రాసి ఉంచింది.. నన్ను క్షమించు బిడ్డా.. నీకు ప్రేమను ఇవ్వలేకపోయాను. మీ నాన్న మరణాన్ని మరిచిలేకపోతున్నాను. మీ నాన్న లేకుండా బతకడం కష్టంగా మారింది. భర్త లేకుండా భార్యకు ఎటువంటి కష్టాలు వస్తాయనేది.. మీ నాన్న మరణం తర్వాత తెలిసింది. నువ్వు అమ్మమ్మ వాళ్లతో ఉండి శ్రద్ధగా చదువుకో. నా మరణానికి ఎవరూ బాధ్యులు కారని ప్రీతి సింగ్ తన సూసైడ్ నోట్లో పేర్కొంది. ఈ హృదయ విదారక ఘటన అందరి హృదయాలను కదిలించింది. చిన్నారి ఏడుపు అందరి మనసులను కలిచివేసింది.