లక్నో: వేశ్యలతో పట్టుబడ్డ వ్యాపారులను మహిళా ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేసింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో ఆమెతోపాటు హోంగార్డ్, మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొత్వాలి పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఎస్ఐ, హోంగార్డ్, మరో సిబ్బంది పంకిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేశారు. వేశ్యలతో ఉన్న ఇద్దరు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు అరెస్టైన ఇద్దరు వ్యాపారులతో ఆ మహిళా ఎస్ఐ బేరసారాలాడారు. జలౌన్కు చెందిన ఆ వ్యాపారులను మూడు గంటలపాటు తన కారులో ఉంచారు. రూ.15 లక్షలు ఇస్తే విడిచిపెడతానని లేకపోతే కేసు నమోదు చేస్తానని ఆమె బెదిరించారు. అయితే ఎలాగోలా తప్పించుకున్న ఆ వ్యాపారులు పోలీస్ కమిషనర్ విజయ్ సింగ్ మీనాను కలిసి జరిగిన విషయం చెప్పారు.
స్పందించిన సీపీ దీనిపై క్రైమ్ బ్రాంచ్తో దర్యాప్తు చేయించారు. వాస్తవమని తేలడంతో వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేసిన మహిళా ఎస్ఐ, హోంగార్డ్తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యాపారులపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.