ముంబై: మహిళను హత్య చేసి మృతదేహాన్ని సోఫా బెడ్ లోపల దాచారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. డోంబివిలిలో నివాసం ఉంటున్న 33 ఏండ్ల సుప్రియా షిండే మంగళవారం తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఆ రోజు ఉదయం తనకు ఒంట్లో బాగోలేదని, కుమారుడ్ని స్కూల్కు తీసుకెళ్లాలని పొరుగింటి వ్యక్తిని కోరింది. అయితే స్కూల్ తర్వాత కూడా కుమారుడ్ని ఆమె తీసుకెళ్లలేదు.
దీంతో స్కూల్ టీచర్ ఆ మహిళ పొరుగింటి వారిని సంప్రదించారు. అయితే సుప్రియా ఇంట్లో కూడా కనిపించలేదు. దీంతో ఆఫీస్లో ఉన్న ఆమె భర్తకు సమాచారం ఇచ్చారు. ఆఫీస్ నుంచి వచ్చిన భర్త, బంధువులు ఇల్లంతా గాలించారు. చివరకు సోఫా బెడ్ లోపల సుప్రియా మృతదేహాన్ని గుర్తించారు.
కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళ గొంతు నులిమి, తలను బాది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 తర్వాత ఈ ఘటన జరిగినట్లు అంచనా వేశారు. పోస్ట్మార్టం కోసం మహిళ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.