చెన్నై: పెండ్లి చేసుకునేందుకు నిరాకరించిన మాజీ ప్రియుడిపై ఒక మహిళ యాసిడ్ పోయడంతోపాటు కత్తితో పొడిచింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఘటన జరిగింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని కోడిపురం ప్రాంతానికి చెందిన 30 ఏండ్ల రాకేష్ గతంలో దుబాయ్లోని స్పా కేంద్రంలో పని చేశాడు. అందులో పని చేసే తమిళనాడు కాంచీపురానికి చెందిన జయంతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు అప్పటికే వివాహం కాగా భర్త నుంచి వీడిపోయింది. వీరిద్దరూ దుబాయ్లో సహజీవనం చేశారు.
ఈ ఏడాది జూలైలో సోదరి వివాహం నిమిత్తం రాకేష్ కేరళకు వచ్చాడు. మూడు నెలల కిందట ఒక మహిళతో అతడికి పెండ్లి జరిగింది. జయంతి కూడా ఇటీవల చెన్నైకి వచ్చింది. దీంతో కోయంబత్తూరు పీలమేడులోని ఒక అపార్ట్మెంట్లో కలుద్దామంటూ రాకేష్ గురువారం ఆమెకు వాట్సాప్ మెసేజ్ పంపాడు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు వారిద్దరూ ఆ అపార్ట్మెంట్లో కలుసుకున్నారు.
ఈ సందర్భంగా తనను పెళ్లి చేసుకోవాలని జయంతి గట్టిగా అడిగింది. రాకేష్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆమె తన బ్యాగ్ నుంచి యాసిడ్ బాటిల్ తీసి రాకేష్పై పోయగా అతడి కంటిపై యాసిడ్ పడింది. అంతటితో ఆగని జయంతి కత్తితో అతడ్ని పొడిచింది. ఆ తర్వాత ఆమె విషం సేవించి ఆత్మహత్యకు యత్నించింది.
వారిద్దరి గొడవ, అరుపులను గమనించిన అపార్ట్మెంట్ వాచ్మేన్ వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. రాకేష్ ఫిర్యాదుతో జయంతిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రాకేష్ తన నుంచి రూ.18 లక్షలు తీసుకుని మోసగించాడని జయంతి ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా రాకేష్పై చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు.