లక్నో : యూపీలోని ఘజియాబాద్లో దారుణం జరిగింది. మహిళకు కూల్డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై కుమారుడి క్రికెట్ కోచ్ లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన కుమారుడి డాక్యుమెంట్లు ఇచ్చేందుకు మంగళవారం ఇందిరాపురంలోని నిందితుడి ఫ్లాట్కు వెళ్లగా కోచ్ ఈ దారుణానికి తెగబడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్రికెట్ కోచ్ కూల్ డ్రింక్లో మత్తు పదార్ధం కలిపి తనకు ఇచ్చాడని ఆపై తాను స్ప్రహ కోల్పోగా గదిలోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. స్ప్రహలోకి రాగానే భర్తకు ఫోన్ చేసి జరిగిన దారుణం వివరించానని చెప్పారు. అనంతరం భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.