120 ఫీట్లతో మూడు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
రోడ్డు కోసం 9 ఎకరాలు భూ సేకరణ
ఇబ్రహీంపట్నం, మార్చి 21 : ఇబ్రహీంపట్నం సమీపంలో సుమారు 500 ఎకరాలల్లో ఏర్పాటు చేసిన బీడీఎల్కు సాగర్ రహదారి నుంచి ప్రత్యేక రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ సమీపంలో ప్రభుత్వం బీడీఎల్ ఏర్పాటుకు భూమిని కేటాయించింది. బీడీఎల్కు పూర్తిస్తాయిలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో బీడీఎల్కు ప్రత్యేక రహదారి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం చెరువు కట్టపై గల దర్గా వెనుక భాగం నుంచి బీడీఎల్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు కోసం రైతుల నుంచి 9 ఎకరాల భూమిని కూడా సేకరించి పరిహారం అందించింది.
నిర్మాణ పనులు ప్రారంభం
రోడ్డు నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. చెరువు కట్ట నుంచి బీడీఎల్ వరకు ప్రభుత్వ భూములతో పాటు పట్టా భూములూ ఉన్నాయి. ఈ మేరకు అధికారులు రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్డు ఏర్పాటుకు భూములు ఇవ్వాలని కోరడంతో రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇందులో 3.39 ఎకరాల పట్టా భూములు 5.13 ఎకరాలు అసైన్డ్ భూములున్నాయి. అసైన్డ్ భూమి ఎకరాకు రూ.11లక్షల పరిహారం, పట్టా భూమికి రూ.14లక్షల చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మార్కెట్లో పట్టా భూములకు చాలా డిమాండ్ ఉండటంతో ప్రభుత్వ పరిహారం సరిపోదని రైతులు అన్నారు. ఈ మేరకు అధికారులు పట్టాదారుల భూముల రైతులకు సంబంధించిన డబ్బులు కోర్టులో డిపాజిట్ చేశారు.
భూ సేకరణకు రూ.1.16కోట్ల నిధులు కేటాయింపు..
భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.1.16 కోట్లను కేటాయించింది. అసైన్డ్ భూమి రైతులకు ఇప్పటికే పరిహారం చెల్లించారు. పట్టా భూముల రైతులు పరిహారం సరిపోదనడంతో మరోమారు ఆర్డీవో చర్చలు జరుపడానికి నిర్ణయించారు.
సాగర్ రహదారి పక్కన
ప్రధాన కూడలి..
సాగర్ రహదారి నుంచి బీడీఎల్ వరకు ఏర్పాటు చేస్తున్న 120 ఫీట్ల రోడ్డుకు గానూ దర్గావెనుక భాగాన ప్రధాన కూడలి ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. ఇక్కడే బీడీఎల్కు సంబంధించిన ప్రధాన గేటు కూడా ఏర్పాటు చేయనున్నారు. గేటు నుంచి బీడీఎల్ వరకు రోడ్డుకిరువైపులా పెద్ద ప్రహరీ నిర్మాణాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
భూ సేకరణ పూర్తి
బీడీఎల్ కోసం సాగర్ రహదారి నుంచి 120 ఫీట్లతో ప్రత్యేక రోడ్డు ఏర్పాటుకు భూ సేకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేశాం. భూ సేకరణలో భాగంగా అసైన్డ్ భూమికి ఎకరాకు రూ.11లక్షలు, పట్టా భూమికి రూ.14లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం చెల్లిస్తున్నది. అసైన్డ్ భూములు 5.13 ఎకరాలు, పట్టా భూములు 3.39 ఎకరాలున్నాయి. పట్టా భూముల రైతులు పరిహారం స్వీకరించడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టా భూముల రైతులకు సంబంధించిన పరిహారాన్ని కోర్టులో డిపాజిట్ చేశాం.
-తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఇబ్రహీంపట్నం