న్యూఢిల్లీ : సైబర్ నేరగాళ్లు (cyber fraud) రూటు మార్చి ఇప్పుడు ఆన్లైన్లో సినిమాలకు రేటింగ్స్ ఇస్తే మంచి రాబడి ఉంటుందని నమ్మబలికి అందినకాడికి దోచేస్తున్నారు. గుజరాత్ దంపతులను స్కామర్లు ఈ తరహా మోసంతో రూ. కోటి పైగా కొట్టేసిన ఉదంతం మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తాజగా మూవీ రేటింగ్ స్కామ్లో గురుగ్రాం మహిళను సైబర్ నేరగాళ్లు నిండా ముంచేశారు.
గురుగ్రాంలో ఓ ఎంఎన్సీలో పనిచేసే దివ్య అనే మహిళ ఆన్లైన్ ఫ్రాడ్లో ఏకంగా రూ. 76 లక్షలు పోగొట్టుకున్నారు. న్యూ కాలనీకి చెందిన దివ్యను ఆన్లైన్లో మూవీ రేటింగ్స్ ఇస్తూ రెండు చేతులా సంపాదించుకునే అవకాశం చూపిస్తామని మభ్యపెట్టిన స్కామర్లు ముగ్గులోకి దించారు. పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో బాధితురాలిని ఫిబ్రవరి 25న మీరా అనే మహిళ టెలిగ్రాంలో సంప్రదించారు. ఆపై తేజస్విని అనే మరో మహిళ బాధితురాలికి వాట్సాప్ మెసేజ్లు పంపారు.
బిట్మ్యాక్స్ఫిల్మ్.కాం యాప్లో ఫిల్మ్ రేటింగ్స్ ఇచ్చే పార్ట్ టైం జాబ్ను తేజస్విని బాధిత మహిళకు ఆఫర్ చేశారు. రేటింగ్ను చేపట్టేందుకు రూ. 10,500 చెల్లించి అకౌంట్ను రీచార్జ్ చేసుకోవాలని సూచించారు. ఆపై టికెటింగ్ లెవెల్ పెరిగిందనే పేరుతో పలు సార్లు పెద్దమొత్తంలో డిపాజిట్ చేయాలని కోరారని అలా మొత్తం రూ. 76 లక్షలు చెల్లించిన తర్వాత తాను మోసపోయానని గ్రహించినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దివ్య పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఆన్లైన్ స్కామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read More
BJP | భార్యను వేధిస్తున్న బీజేపీ నేత.. అదనపు కట్నం తేవాలని పుట్టింటికి పంపిన నాయకుడు