లక్నో : తల్లిదండ్రులను మత్తులోకి జారుకునేలా చేసి ప్రియుడి సహాయంతో తన సొంత ఇంట్లోనే ఓ యువతి దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గోసాయిగంజ్లో చోటుచేసుకుంది. రూ. 13 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన ఆభరణాలను అపహరించింది. సౌత్ డిప్యూటీ కమిషనర్ ఖ్యాతి గార్గ్ వివరాలను వెల్లడించారు. తన ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా వ్యాపారవేత్త మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు విలువైన వస్తువులు భద్రపరిచిన లాకర్లన్నీ తెరిచిఉన్నప్పటికీ ఇంట్లోకి ఎవరూ బలవంతంగా ప్రవేశించినట్లుగా ఆనవాళ్లు లేవన్నారు.
అనుమానంతో వ్యాపారి కుమార్తెను ప్రశ్నించగా నేరాన్ని ఒప్పుకుందన్నారు. దీంతో ఖుష్బు, ఈమె ప్రియుడు వినయ్ యాదవ్, ఇతని సహాయకుడు శుభం యాదవ్ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. మరో నిందితుడు రంజిత్ యాదవ్ ఇంకా పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. చోరీకి గురైన సొత్తును సైతం రికవరీ చేసినట్లు చెప్పారు. వినయ్తో బంధంలో ఉండటం ఖుష్బు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఇతడితో పారిపోయేందుకు నిశ్చయించుకుని యువతి తల్లిదండ్రులకు తేనీరులో నిద్రమాత్రలిచ్చి మత్తులోకి జారుకునేలా చేసింది. అనంతరం ప్రియుడు, అతడి స్నేహితులతో కలిసి ఇంట్లోని నగదు, బంగారాన్ని అపహరించింది.