చెన్నై : కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురిపైనే ఓ తండ్రితో కామంతో చెలరేగిపోయాడు. నిద్రిస్తున్న కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బిడ్డ అరుపులు విన్న తల్లి మేల్కొని.. భర్తను హత్య చేసింది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒట్టేరి పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కేరళకు చెందిన ఈ కుటుంబం 50 ఏండ్ల క్రితం చెన్నైకి వలసొచ్చి స్థిరపడ్డారు. నిందితురాలి మామ టైలర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. నిందితురాలు, ఆమె భర్త కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 20 ఏండ్ల వయసున్న కుమార్తె, నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. అయితే కుమార్తె ఎక్కువగా అమ్మమ్మ వాళ్లతోనే ఉంటుంది. వారు గురువారం బంధువుల ఇంటికి వెళ్లడంతో.. ఆ యువతి తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది.
తల్లిదండ్రులతో పాటు కుమారుడు మంచంపై పడుకోగా, కూతురు మాత్రం నేలపై పడుకుంది. ఇక శుక్రవారం తెల్లవారుజామున కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి గట్టిగా కేకలు వేయడంతో.. తల్లికి మెలకువ వచ్చింది. ఆ క్రూర మృగం నుంచి బిడ్డను కాపాడుకునేందుకు గట్టిగా పోరాడింది. ఇంట్లో ఉన్న సుత్తితో భర్త తలపై పలుమార్లు బాదింది. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
ఆ తర్వాత నిందితురాలు నేరుగా ఒట్టేరి పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. భర్త హత్యకు ఉపయోగించిన సుత్తిని కూడా పోలీసులకు అప్పగించింది. భర్త క్రూరమైన చర్య నుంచి బిడ్డను కాపాడుకునేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు నిందితురాలు ఒప్పుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.