ముంబై : పోటీ పరీక్షలకు ప్రిపేరవుతూ శిక్షణ తీసుకుంటున్న సమయంలో పరిచయమైన యువతీ యువకులు ఆపై పుణేలో ఒకే ఇంట్లో సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఆగస్ట్ 29న ప్రియుడిని ఊపిరిఆడకుండా చేసిన ప్రియురాలు అతడిని కడతేర్చింది. స్ధానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్ధలానికి వెళ్లిన పోలీసులకు అసలు విషయం బయటపడింది.
వేర్వేరు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వీరిని సోనాల్ దభాడే (28), రోహిణి (24)గా గుర్తించారు. తన ప్రియుడిది సహజ మరణమేనని పోలీసులతో రోహిణి నమ్మబలికింది. అయితే సోనాల్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించగా అతడిది హత్యేనని వెల్లడైంది. ఘటన జరిగిన రోజు ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగిందని రోహిణి బాధితుడు సోనాల్ను గట్టిగా తోసివేయడంతో అతడు కింద పడ్డాడని ఆపై ఊపిరిఆడకుండా చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.