ముంబై : అనుమానంతో సహజీవనం చేస్తున్న మహిళను ఆమె ఐదేండ్ల చిన్నారి ఎదుటే దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం ముంబైలోని అంధేరి ఈస్ట్ సంఘర్ష్ నగర్లో వెలుగుచూసింది. బాధితురాలిని మనీషా జాదవ్ (29)గా గుర్తించారు. టీవీ రిపేర్లు చేస్తుండే రాజు నీలేతో మనీషా జాదవ్ గత కొన్నేండ్లుగా సహజీవనం చేస్తోంది.
మనీషా ఐదేండ్ల కూతురు కూడా వారితోనే ఉంటోంది.మరో వ్యక్తితో మనీషా అఫైర్ నడుపుతోందనే అనుమానంతో రాజు నీలే తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడు. ఘటన జరిగిన రోజు కూడా ఇద్దరి మధ్య ఈ విషయమై ఘర్షణ జరగడంతో కోపంతో ఊగిపోయిన రాజు నీలే ఆమె తలపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు.
ఆపై కత్తితో ఆమె ముక్కు, మెడ, ఛాతీ, కడుపు భాగంలో పొడిచాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాలిక భయంతో కేకలు వేయడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అరెస్ట్ చేశారు.