ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మందు కాదు, విషమని. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. కాజోల్ పవార్ అనే 24 ఏళ్ల యువతికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది.
మందు వేసుకునే సమయంలో పొరపాటున మందు అనుకొని ఎలుకల మందు తాగేసింది. ఈ నెల 13వ తేదీ రాత్రి 9.30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తనకు విపరీతంగా వాంతులు అవుతుండటంతో.. తల్లి ఆనంద గవహానేకు ఫోన్ చేసిన కాజోల్ విషయం చెప్పింది. ఆ రోజు ఉదయమే కాజోల్ భర్త అభిషేక్.. రాయగఢ్ వెళ్లాడు.
ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న తల్లి.. సాకినాక ప్రాంతంలో ఉండే కుమారుడితో కలిసి కాజోల్ ఇంటికి వచ్చింది. కడుపు నొప్పి మందు వేసుకున్నప్పటి నుంచి వాంతులు అవుతున్నాయని, తనకు సహాయం కావాలని చెప్పింది. దీంతో హుటాహుటిన వచ్చిన తల్లి.. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది.
అయితే అప్పటికే ఆరోగ్యం క్షీణించిన కాజోల్.. రెండు ఆస్సత్రులు తిరిగే సరికి కన్నుమూసింది. కాజోల్ తల్లి, భర్త ఇద్దరూ కూడా తమకు ఎవరి మీద అనుమానాలు లేవని చెప్పడంతో యాక్సిడెంటల్ డెత్ కింద రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు.