ముంబై: ఇంట్లో ఎలుకలను చంపేందుకు ఒక మహిళ టొమాటోలలో ఎలుకల మందు పెట్టింది. అయితే ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్న ఆమె పొరపాటున ఆ విషపు టొమాటోలను అందులో వాడింది. దీంతో ఆ సూడుల్స్ తిన్న ఆ మహిళ అస్వస్థతకు గురై మరణించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మలాడ్లోని పాస్కల్ వాడి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల రేఖా నిషాద్ ఈ నెల 21న ఇంట్లో ఇన్స్టంట్ నూడుల్స్ చేసింది.
అయితే టీవీ చూస్తున్న ఆమె, వంటింట్లో ఎలుకలను చంపేందుకు ఎలుకల మందు కలిపి ఉంచిన టొమాటోలను పొరపాటున నూడుల్స్ తయారీలో వినియోగించింది. అనంతరం ఆ నూడుల్స్ తిన్న ఆ మహిళ వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన భర్త, మరిది వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ఆరు రోజులు చికిత్స పొందిన ఆ మహిళ బుధవారం మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.