కోల్కతా : కూతురితో కలిసి భర్తను ఊపిరాడకుండా చేసి ఉసురుతీసిన మహిళ ఉదంతం పశ్చిమ బెంగాల్లోని హౌరాలో బుధవారం వెలుగుచూసింది. మృతుడిని బంగారం షాపు నిర్వహించే షేక్ సలాం (55)గా గుర్తించారు. బుధవారం రాత్రి సలాం భార్య సుల్తానా బేగం ఇరుగుపొరుగు వారిని పిలిచి తాను తన కూతురు బయటకు వెళ్లి తిరిగి రాగానే భర్త బెడ్పై విగతజీవిగా పడిఉన్నాడని చెప్పింది.
ఈ ఘటనపై స్ధానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మహిళను ప్రశ్నించగా తన భర్త ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులను కలుస్తానని చెప్పాడని దీంతో తన కూతురితో పాటు తాను బయటకు వెళ్లానని సుల్తానా తెలిపింది.
కొద్దిసేపటి తర్వాత తాము ఇంటికి తిరిగి రాగా సలాం హత్యకు గురయ్యాడని చెప్పింది. అనుమానంతో పోలీసులు తల్లీకూతుళ్లను అదుపులోకి తీసుకోగా సలాం చీటికిమాటికి తమను శారీరకంగా హింసిస్తుండటంతో తామే అతడని అంతమొందించామని వారు అంగీకరించారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.