భోపాల్ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ (45)పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడి (45)కి బాధితురాలు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఘటన మధ్యప్రదేశ్లోని సిద్ధి జిల్లాలో వెలుగుచూసింది. జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలోని ఉమరిహ గ్రామంలో ఈ ఉదంతం గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ ఘటన జరిగిన సమయంలో భర్త వేరేపనిమీద బయటకు వెళ్లాడు. మహిళ తన 13 ఏండ్ల కుమారుడితో ఇంటి వద్ద ఉండగా ఆమె ఒంటరిగా ఉందనే విషయం పసిగట్టి నిందితుడు ఇంటిలోపలికి వచ్చాడు.
నిందితుడు నేరుగా మహిళపై లైంగిక దాడికి యత్నించాడు. తీవ్రంగా ప్రతిఘటించిన మహిళ తనను తాను రక్షించుకునేందుకు పరుపు కింద ఉన్న పదునైన ఆయుధంతో అతడి వృషణాలను కత్తిరించింది. ఆపై మహిళ రాత్రి 1.30 గంటలకు స్ధానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితుడిపై ఫిర్యాదు చేసింది. నిందితుడిని తొలుత దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స జరిపించిన అనంతరం వైద్యుల సూచనతో రెవా జిల్లాలోని సంజయ్ గాంధీ మెడికల్ కాలేజ్ దవాఖానకు పోలీసులు తీసుకువెళ్లారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మహిళపై నిందితుడు కూడా ఫిర్యాదు చేశాడని స్ధానిక ఎస్ఐ ధర్మేంద్ర సింగ్ రాజ్పుట్ చెప్పారు.