బర్మేర్: రాజస్థాన్లోని బర్మేర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ 23 ఏండ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వాటర్ ట్యాంకులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని రామ్ సరియా గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రామ్సరియా గ్రామానికి చెందిన హవీ దేవి (23) తన భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నది. భర్త గుజరాత్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం సాయంత్రం హవీదేవి తన కుమారుడు దక్షిత్ (3), కుమార్తె కల్పన (1)తో కలిసి గ్రామ శివార్లలోని ఓ వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్లింది. అక్కడ పిల్లలిద్దరినీ వాటర్ ట్యాంకులో పడేసి అనంతరం తానూ అందులోనే దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఆత్మహత్యలకుగల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.