ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిన ఒక యువకుడు. వారం రోజులుగా తిరిగి రాలేదు. అతనెక్కడున్నాడో ఆచూకీ తెలియలేదు. అతని కోసం ఎంత వెతికినా కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేయగా.. అతడు చివరగా తన ప్రియురాలు ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆమెపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా.. భయంకరమైన నిజం బయటపడింది. ఆ యువకుడిని ఆమె హత్య చేసి తన బెడ్ రూంలో పాతిపెట్టింది. ఈ సంఘటన బీహార్లోని పూర్ణియా జిల్లాలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణియా జిల్లాకు చెందిన సంపత్ భూముల లావాదేవీల వ్యాపారం చేసేవాడు. అతడికి ఆశా దేవి అనే ప్రియురాలు ఉంది. ఆమెకు ఇంతకుముందే భర్త కూడా ఉన్నాడు. వారిద్దరి మధ్య ఉన్నది వివాహేతర సంబంధం. ఈ క్రమంలో ఒకరోజు ఆశా దేవి ఇంటికి సంపత్ వెళ్లాడు. అక్కడ సంపత్ తన వ్యాపార మిత్రులతో మద్యం సేవిస్తుండగా.. ఒక స్థలం గురించి గొడవ జరిగింది.
ఆ స్థలం ఆశా దేవి భర్త పేరు మీద ఉంది. దానిని సంపత్ మధ్యవర్తిగా ఉంటూ మరొకరికి విక్రయించి.. కమిషన్ తీసుకున్నాడు. కానీ ఆ రోజు మద్యం సేవిస్తూ ఆ స్థలం డాక్యుమెంట్లు నకిలీవని, ఆశాదేవి తన భర్తతో కలిసి తనను మోసం చేసిందని సంపత్కు తెలిసిపోయింది. దీంతో అతను గొడవ చేశాడు. అప్పుడు అతడిని ఆశాదేవి, ఆమె భర్త కలిసి కత్తులతో పొడిచి చంపేశారు. ఆ తరువాత ఎవరికీ తెలియకుండా శవాన్ని బెడ్రూం లో పాతిపెట్టారు. కానీ సంపత్ మొబైల్ ఫోన్ కాల్ రికార్డ్స్, చివరి లొకేషన్ ఆధారంగా పోలీసులు ఆశాదేవిని అనుమానించి పట్టుకున్నారు.
పోలీసులు తమ పద్ధతిలో విచారణ చేయగా.. ఆశా దేవి జరిగినదంతా చెప్పింది. ఆ తరువాత పోలీసులు ఆ ఇంట్లో నుంచి సంపత్ మృతదేహాన్ని వెలికితీశారు. ప్రస్తుతం ఆశాదేవిని పోలీసులు హత్య కేసులో అరెస్టు చేశారు. ఆమె భర్త పరారీలో ఉన్నాడు.