పుణే : తమ ఇంటి బాత్రూం వైపు సీసీటీవీ కెమెరా అమర్చారని, కెమెరా యాంగిల్ మార్చాలని కోరిన మహిళ సహా ఆమె కుటుంబ సభ్యులపై దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణే జిల్లాలోని వద్గోంషెరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం నిందితుడు తన ఇంటి వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చగా వాటిలో ఒకటి పొరుగింటి మహిళ బాత్రూం వైపుగా ఉంది.
ఈ కెమెరా యాంగిల్ను మార్చాలని మహిళ కోరగా ఆమెను నిందితుడు దుర్భాషలాడాడు. ఆమె సోదరుడు వారించినా అతడినీ దూషించాడు. ఆపై బాధితులు తిరిగి తమ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే నిందితుడు తన అనుచరులతో మహిళ ఇంటికి వెళ్లి ఆమెతో పాటు ఆమె సోదరుడు, తల్లిపైనా దాడికి దిగారు. అడ్డుగా వచ్చిన ఆమె స్నేహితురాలినీ హింసించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.