జైపూర్ : రాజస్ధాన్లోని దౌసా జిల్లాలో దారుణం జరిగింది. 35 ఏండ్ల వివాహితపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి హత్య చేయడం కలకలం రేపింది. మహిళ మృతదేహం జైపూర్ జిల్లా బస్సి పోలీస్ స్టేషన్ పరిధిలోని బావిలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ ఆదివారం ఉదయం దౌసాలోని పుట్టింటికి వెళ్లేందుకు జైపూర్ నుంచి బయలుదేరింది.
మహిళ దౌసా బస్టాండ్కు చేరుకుని పుట్టింటికి నడిచి వెళుతోంది. ఈ క్రమంలో నిందితుడు తన వాహనంలో లిఫ్ట్ ఇస్తానని ఎక్కించుకున్నాడు. ఆపై మహిళను తన గ్రామానికి తీసుకువెళ్లకుండా అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లిన నిందితుడు మరో వ్యక్తితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం మహిళను హత్య చేసిన నిందితులు ఆమె మృతదేహాన్ని బావిలో పడేసి వెళ్లారని దౌసా ఎస్పీ రాజ్కుమార్ గుప్తా తెలిపారు.
ఇక బాధితురాలు ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లితండ్రులు ఆదివారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం బాధితురాలి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కలూరాం మీనాను అరెస్ట్ చేసిన పోలీసులు మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోస్ట్మార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.