లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు బ్రేక్ పడటం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని జెవర్ గ్రామంలో 55 ఏండ్ల మహిళపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బాధితురాలి ఆరోగ్య పరిస్థితి విషమం కాగా ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ పశువుల మేత కోసం పొలానికి వెళ్లగా ఆ సమయంలో అక్కడే ఉన్న దుండగులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన మహేంద్ర మత్తుపదార్ధాలకు బానిసయ్యాడు. మహేంద్ర అతడి ముగ్గురు స్నేహితులు బాధితురాలిపై దారుణానికి ఒడిగట్టారు. మహిళ స్పృహ కోల్పోయిన స్థితిలో నిందితులు ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. ఆమెను కాపాడిన స్ధానికులు తీవ్ర రక్తస్రావమవడంతో నోయిడాలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని నోయిడా డీసీపీ వృందా శుక్లా పేర్కొన్నారు.