ముంబై : మహారాష్ట్రలోని నాసిక్ వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి కంటైనర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న కొంత మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ సందర్భంగా ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ.. గాఢ నిద్రలో ఉన్నాం. భారీ శబ్దం రావడంతో నిద్ర లేచాం. అంతలోపే బస్సులో మంటలు అంటుకున్నాయి. తన కూతురితో కలిసి క్షణాల్లోనే బస్సు దిగేశామని అనితా చౌదరి మీడియాకు తెలిపింది. తాము ప్రాణాలతో బయటపడటం అదృష్టంగా భావిస్తున్నామని ఆమె పేర్కొంది. తాము వసీం జిల్లాకు చెందిన వారమని తెలిపింది.
మరో ప్రయాణికుడు పిరాజీ ధోత్రే మాట్లాడుతూ.. తమ అంకుల్స్తో కలిసి బస్సులో ప్రయాణిస్తున్నామని చెప్పారు. నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందన్నారు. తమ అదృష్టం కొద్ది త్వరగా లేచి, బయటపడ్డామని పేర్కొన్నారు. తమ కళ్ల ముందే బస్సు పూర్తిగా కాలిపోయిందన్నారు. మా అంకుల్ ఒకరు స్వల్ప గాయాలపాలయ్యారని తెలిపారు. ధోత్రేది యావత్మల్ జిల్లా.