చెన్నై: చిట్ఫండ్ మోసం కేసులో రెండేండ్లుగా పోలీసుల కళ్లగప్పి తిరుగుతున్న మహిళ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యింది. టీకా తీసుకున్న డేటా ఆధారంగా పోలీసులకు ఆమె చిక్కింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన జరిగింది. 48 ఏండ్ల శశికళ, ఈశ్వరి కలిసి చిట్ పేరుతో రూ.50 లక్షల మేరకు మోసగించినట్లు చెన్నైలోని కొడుంగయ్యూర్ పరిసర నివాసి ప్రేమతో పాటు ఇతర డిపాజిట్దారులు 2019లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈశ్వరీని పోలీసులు అరెస్ట్ చేయగా శశికళ నాటి నుంచి పరారీలో ఉన్నది.
కాగా, కాంచీపురం వెళ్లిన శశికళకు కష్టాలు చుట్టుముట్టాయి. భర్త సురేశ్బాబు ఉద్యోగం కోల్పోవడంతోపాటు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కుటుంబం భారం శశికళపై పడింది. ఆమె ఇండ్లలో పని చేస్తూ కటుంబాన్ని పోషిస్తున్నది. చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆమెకు మొబైల్ ఫోన్ కూడా లేదు. దీంతో బంధువులు ఎవరితోనూ ఆమె మాట్లాడకపోవడంతో శశికళ ఆచూకీని పోలీసులు రెండేండ్ల వరకు కనిపెట్టలేకపోయారు.
మరోవైపు చిట్ఫండ్ మోసం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరోసారి శశికళను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు. ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా కాంచీపురం ప్రభుత్వ స్కూలులో ఆమె టీకా తీసుకున్నట్లు తెలుసుకున్నారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం కాంచీపురం వెళ్లి వారం రోజులు అక్కడ మకాం వేసింది. శశికళ ఫొటో చూపించి ఆమె ఆచూకీ కోసం సుమారు వెయ్యి మందిని పోలీసులు ఆరా తీశారు. చివరకు కేబుల్ టీవీ ఆపరేటర్ ఇచ్చిన సమాచారంతో ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు.