అమరావతి: గుంటూరు జిల్లా పొన్నూరులోని భావననగర్ కాలనీలో దారుణం జరిగింది. భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. పొన్నూరు అర్బన్ పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి మార్చురీకి తరలించారు. వివరాల్లోకి వెళితే మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లికి చెందిన నాగరాజుకు షేమా సోనితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలు పొన్నూరులో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
ఈ క్రమంలో సోనీకి అదే కాలనీకి చెందిన మరో యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి నాగరాజును హత్య చేసేందుకు పథకం వేశారు. ఈ నెల 1వ తేదీన ఇంట్లోనే హత్య చేసి మృతదేహాన్ని బాపట్ల మండలం అప్పిగట్ల సమీపంలోని కాలువలో పడేశారు. నాగరాజు కనిపించకపోవడంలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది. నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నాగరాజు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.