వాట్సాప్లో హలో మమ్మీ! హలో డాడీ అంటూ కొందరు తల్లిదండ్రులకు మెసేజ్లు వస్తున్నాయి. అవి చదివిన వారు తమ పిల్లలే వేరే నెంబర్తో మెసేజ్లు చేస్తున్నారనుకొని వెంటనే వాటికి స్పందిస్తున్నారు. ఆ మెసేజ్లలో వారి పిల్లలు ఏదో ప్రమాదంలో ఉన్నారని తెలిసి వారిని కాపాడడానికి తల్లిదండ్రులు.. మెసేజ్ చేసేవారికి అడిగినంత డబ్బులు పంపిస్తున్నారు.
అలా డబ్బులు పంపిన వెంటనే ఆ మెసేజ్లు పంపిన వ్యక్తి ఫోన్ స్విచాఫ్ అయిపోతుంది. అలా వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులను దోచుకున్న సంఘటనలు ఇటీవల యూకె(ఇంగ్లాండ్)లో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.ఇలాంటి వాట్సాప్ మెసేజ్లతో ఒక వ్యక్తి ఏకంగా 50,000 పౌండ్లు( సుమారు రూ.50 లక్షలు), మరో వ్యక్తి 3,000 పౌండ్లు(రూ.3 లక్షలు) పోగొట్టుకున్నారు. సైబర్ నేరగాళ్లు తల్లిదండ్రులు, వారి పిల్లల గురించి సమాచారం సేకరించి అక్కడ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
భారత్లో కూడా
ఈ తరహాలోనే భారతదేశంలో ఫేస్బుక్ మెసెంజర్లో ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులనే కాక, మిత్రులను కూడా మోసగాళ్లు టార్టెట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి అకౌంట్ని పోలి ఉన్న పేరు లొగోతో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా ఆన్లైన్ మోసగాళ్లు మెసేజ్లు పంపుతున్నారు. అవి నిజమని నమ్మి.. తమ మిత్రుడిని ఆపద నుంచి రక్షిద్దామని భావించి.. డబ్బులు పంపినవారు మోసపోతున్నారు.
ఈ విషయంలో వాట్సాప్, మెసెంజర్ యాజమాన్యాలు భద్రతాపరంగా ఎంతో అప్డేట్ అయినప్పటికీ.. యూజర్లు కూడా కొంత జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. డబ్బులు పంపేముందు ఆ మెసేజ్లు పంపింది తమ పిల్లలో కాదో ఒకసారి ధృవీకరించుకోవాలని చెబుతున్నారు.