దోమలగూడ : మంచినీటి ట్యాంక్లో శవమై కనిపించిన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంగళవారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలగడ్డ వద్ద ఉన్న మంచినీటి ట్యాంక్లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా మృతుడి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేయగా, రిసాలగడ్డకు చెందిన పుష్పలత అనే మహిళ ముషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి మృతుడు తన కుమారుడు అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గాంధీ దవాఖాన మార్చురీలో మృతుడి ఆనవాలు బట్టి తన కుమారుడు కిషోర్గా గుర్తించారు.
ఇదిలా ఉండగా, కిషోర్ అక్టోబర్ 19న ఇంట్లో తన సోదరుడు నరేష్తో గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తిరిగి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు అక్టోబర్ 23 న చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు గత కొద్ది రోజులుగా మద్యం, గంజాయికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో సోదరుడితో ఘర్షణ పడి ఆవేశంతో వెళ్ళి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటంబ సభ్యులు తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని మృతుడి కుటుంబ సబ్యులకు అందజేసారు.