అంబర్పేట : గోల్నాక డివిజన్ గంగానగర్లో గల వేస్ట్ పేపర్ గోదాంలో నిన్న అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. వేస్ట్ పేపర్ మొత్తం అగ్నికి ఆహూతైంది. ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను ఆర్పాయి. గత మూడేళ్ల క్రితం కూడా ఇదే గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది.
సంఘటన జరిగిన ప్రదేశాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్లు సంద ర్శించారు. అవసరమైన సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ సందర్భం గా స్థానికులు ఇళ్ల మధ్యలో గల గోదాముల వల్ల తాము ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు.
అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కరెంటు వైర్లు కాలిపోవడంతో ఇళ్లలో కూడా కరెంటు వస్తువులు కాలిపోతున్నాయని వాపోయారు. గోదాంల నుంచి వెలువడే మంటలు, పొగ వల్ల భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ సరైన భద్రత, నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడాన్ని తప్పుపట్టారు.
ఇన్స్రెన్స్ సైతం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా గోదాములు నిర్వహిస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రమాదానికి గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తగిన పరిహారం అందేలా చూడాలని సూచించారు.
కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇళ్ల మధ్యన ఉన్న ఇలాంటి గోదాములపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి గోదాములను సీజ్ చేయిస్తామన్నారు. సంఘటన స్థలాన్ని అంబర్పేట ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు రవీందర్, మల్లేశం, హైదరాబాద్ ఫైర్ ఇన్ఛార్జి శ్రీనివాస్ తదితరులు సందర్శించారు.