పూడూరు : డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో అదుపుతప్పి స్కూల్ బస్ పొలంలోకి దూసుకుపోయిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి-వికారాబాద్ జిల్లాల సరిహద్దులో ఉన్న పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి స్టేజీ వద్ద ఉన్న సిల్వర్డెల్ ధ హైస్కూల్ మండల పరిధి నుంచి పలు గ్రామాల పిల్లలు చదువుకునేందుకు వెళ్తారు. ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతి రోజు ఆ స్కూల్ బస్లోనే పాఠశాలకు తీసుకువెళ్తారు. బుధవారం ఉదయం విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లడానికి వస్తుండగానే చన్గోముల్ సమీపంలో డ్రైవర్ అజాగ్రత్తతో రోడ్డు ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి పొలంలోకి దూసుకెళ్లింది.
విద్యార్థులు బస్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. విద్యార్థులను తీసుకువెళ్లె సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పిల్లలకు తీవ్రగాయాలు జరిగి ఉండేవని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. మండల విద్యాధికారులు సైతం ప్రైవేట్ పాఠశాలలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపనలు వినిపిస్తున్నాయి.