న్యూఢిల్లీ : ఒకప్పుడు కూరగాయలు విక్రయించి పొట్ట పోసుకునే 27 ఏండ్ల రిషబ్ శర్మ కొవిడ్-19 మహమ్మారి విజృంభించిన సమయంలో రూటు మార్చి కేటుగాడి (Cyber Fraud) అవతారమెత్తాడు. శర్మ మారియట్ బాన్వాయ్ హోటల్ పేరిట నకిలీ వెబ్సైట్ తెరిచి ఉద్యోగావకాశాల పేరుతో ప్రజలను నిండా ముంచాడు. ఆరు నెలల్లో అమాయకులను మభ్యపెట్టి రూ. 21 కోట్లు కొట్టేసిన కేటుగాడిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. పది రాష్ట్రా్లోని 37 కేసుల్లో రిషబ్ శఱ్మ నిందితుడు కాగా, మరో 855 స్కామ్ల్లో అతడి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు.
చైనా, సింగపూర్ వంటి దేశాల్లో క్రిమినల్ గ్రూప్స్తోనూ అతడికి సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నారు. కొన్నేండ్ల కిందట రిషబ్ ఫరీదాబాద్లో కూరగాయలు విక్రయించేవాడు. కరోనా మహమ్మారితో వ్యాపారం మూతపడటంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు వర్క్ ఫ్రం హోం జాబ్లు చేసేవాడు. ఆన్లైన్ స్కామ్స్లో చేయి తిరిగిన పాత స్నేహితుడు సూచనతో శర్మ ఈ నకిలీ దందా చేపట్టాడు. ఫ్రెండ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ల నుంచి కొన్ని నెంబర్లకు ఫోన్ చేస్తూ వారికి నకిలీ ఉద్యోగావకాశాలను ఎర వేసేవాడు. డెహ్రాడూన్కు చెందిన ఓ వ్యాపారి చివరిసారిగా శర్మ చేతిలో రూ. 20 లక్షలు నష్టపోయాడు. మారియట్ బాన్వాయ్ హోటల్ వెబ్సైట్ను పోలిన నకిలీ వెబ్సైట్ను రిషబ్ శర్మ క్రియేట్ చేశాడు.
హోటల్ గ్రూప్నకు సంబంధించిన రివ్యూలు రాసేందుకు పార్ట్టైం జాబ్ను ఆఫర్ చేశాడు. తాను మారియట్ బాన్వాయ్ హోటల్ ప్రతినిధినని చెప్పుకుంటూ బాధితులను తన కొలీగ్ సోనియాకు పరిచయం చేసేవాడు. పాజిటివ్ రివ్యూలు రాయాలని వారిని కోరి ఆపై నకిలీ గెస్ట్ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టేవాడు. బాధితుల విశ్వాసం చూరగొనేందుకు వారికి తొలుత రూ. 10,000 అందించేవాడు. ఆపై మెరుగైన రిటన్స్ కోసం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కోరేవాడు. అతడి మాటలు నమ్మి కస్టమర్లు భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసిన అనంతరం కనుమరుగుయ్యేవాడు. ఇలా పలువురిని మోసగించి కోట్లు కొట్టేశాడు. పది రాష్ట్రాలకు రిషబ్ శర్మ నెట్వర్క్ విస్తరించడం తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
Indian 2 | సెగలు రేపుతున్న ఇండియన్ 2 ఆయుధం.. కమల్హాసన్ టీం AN INTRO శాంపిల్ అదిరింది