Gender Change | ఓ తాంత్రికుడు దారుణానికి పాల్పడ్డాడు. అబ్బాయిలా మారుస్తానని చెప్పి.. యువతిని నరికి చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్బాద్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. షాజహాన్బాద్ జిల్లాలోని ఆర్సీ మిషన్ పోలీసు స్టేషన్ పరిధిలోని పూనమ్, ప్రీతి ఇద్దరు మంచి దోస్తులు. ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య సాన్నిహిత్యం పెరిగి, స్వలింగ సంపర్కులుగా మారారు. అయితే ఈ విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలియదు. ప్రీతికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. కానీ పూనమ్తో తనకున్న సంబంధం బయటపడటంతో సంబంధాలన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో ప్రీతి తల్లి ఊర్మిళ ఓ ప్లాన్ రచించింది. స్థానికంగా నివాసం ఉండే రామ్ నివాస్ అనే తాంత్రికుడిని సంప్రదించింది. పూనమ్ను చంపితే రూ. 1.5 లక్షలు ఇస్తానని చెప్పింది. ఒప్పందంలో భాగంగా మొదట రూ. 5 వేలు ఇచ్చింది. ఇక ప్రీతి పూనమ్కు ఫోన్ చేసి.. ఓ తాంత్రికుడు నిన్ను అబ్బాయిలా మారుస్తానని చెప్పాడని నమ్మబలికింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన పూనమ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఏప్రిల్ 26న తన సోదరి అదృశ్యమైందని పూనమ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రీతి, పూనమ్ మధ్య రిలేషన్ గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రీతి, రామ్ నివాస్ మధ్య జరిగిన సంభాషణను పోలీసులు సేకరించారు. దీంతో రామ్ నివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం చెప్పాడు. పూనమ్ను తానే చంపినట్లు అంగీకరించాడు.
అబ్బాయిలా మారుస్తానని చెప్పిన తాంత్రికుడు.. పూనమ్ను స్థానికంగా ఉన్న నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను నేలపై పడుకోబెట్టి, కళ్లు మూసుకుంటే అబ్బాయిలా మారిపోతావని నమ్మించాడు. తాంత్రికుడు చెప్పినట్టే.. పూనమ్ చేసింది. ఇక పూనమ్ కళ్లు మూసుకోగానే.. తాంత్రికుడు కొడవలితో ఆమె గొంతు నరికేశాడు. అనంతరం డెడ్బాడీని చెట్ల పొదల్లో వేసి పారిపోయాడు. మొత్తంగా ఈ కేసులో ప్రీతి, రామ్ నివాస్ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఊర్మిళ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.