నల్లగొండ రూరల్, జూన్ 20 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నాయని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అదివారం 424 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ మేనమామలా పెండ్లి కానుక అందిస్తున్నారని, ఈ పథకం పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తాసీల్దార్ నాగార్జునరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నంరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దేప వెంకట్రెడ్డి, పట్టణాధ్యక్షుడు పిల్లి రామరాజు, టీఆర్ఎస్ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, నిరంజన్వలీ, పంకజ్ యాదవ్, రావుల శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.