బేగంపేట్ : వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొని ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శనివారం అర్థరాత్రి 2 గంటలకు రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓల్డ్ గాస్మండి ప్రాంతానికి చెందిన అనిల్కుమార్ (23) బోయిగూడ ప్రాంతానికి చెందిన రోహిత్ (24) లు స్నేహితులు. వీరిద్దరూ ప్రైవేట్ ఉద్యోగులు. కాగా వీరిద్దరు కలిసి పీవీ ఘాట్ నుంచి కైనటిక్ హోండాపై వస్తూ సికింద్రాబాద్ రావడానికి కర్భాలామైదాన్ వద్ద ఎడమ చేతి వైపుకు తిరిగారు.
ఇంతలో ట్యాంక్బండ్ నుంచి అతి వేగంగా వస్తూ ఫ్యారడైజ్ వైపుకు వెలుతున్న డీసీఎం వ్యాన్ వీరి వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న రాంగోపాల్పేట్ పోలీసులు గాయపడిన ఆ ఇద్దరి యువకులను వెంటనే స్థానిక కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటికే అనిల్కుమార్ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్థారించారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన రోహిత్ను గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మృతి చెందాడు. అనిల్కుమార్ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.